అంబేద్కర్ నినాదాలపై పాఠ్య పుస్తకాల ద్వారా తప్పుడు ప్రచారం!
లక్నో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నినాదాలను గుజరాత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందా? కోట్లాదిమంది దళితులు, బడుగు, బలహీన వర్గాలను ఉత్తేజితులను చేసిన ఆ నినాదాలను కాషాయమయం చేస్తోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి. కోట్లాదిమంది దళితుల జీవనాడిగా గుర్తింపు ఉన్న అంబేద్కర్ నినాదాలపై సమాజానికి తప్పుడు సందేశాలను ఇస్తోందని ధ్వజమెత్తారు.
శిక్షిత్ బనో, సంఘర్ష్ కరో, సంఘటిత్ బనో.. బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఈ పిలుపు దళిత, బడుగు, బలహీన సమాజాన్ని కదిలించింది. వారిలో నూతనోత్తేజాన్ని నింపింది. అన్ని రంగాల్లోనూ పురోగమించేలా చేసింది. ఇప్పుడు ఈ నినాదాలను బీజేపీ ప్రభుత్వం కాషాయమయం చేస్తోందని, పిల్లల పాఠ్యాంశాల్లో కొత్త అర్ధాన్ని ఇస్తోందని మాయావతి మండిపడుతున్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా ఆమె అభివర్ణించారు.
దళితులకు వ్యతిరేకంగా, అంబేద్కర్ నినాదాలపై గుజరాత్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె విమర్శించారు. గుజరాత్ లో దశాబ్దాల కాలం నుంచీ దళితులు అనాదరణకు గురవుతున్నారని, బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. గుజరాత్ లో అగ్రవర్ణాలదే పెత్తనం అని మండిపడ్డారు. దళిత, మైనారిటీ వర్గాలకు ఆ రాష్ట్రంలో ఏనాడూ రక్షణ లేదని చెప్పారు.
కమలం నీడన టీడీపీ అజెండా అమలు చేస్తున్నారా? చంద్రబాబుది చారిత్రక తప్పు
అంబేద్కర్ నినాదాలపై తప్పుడు అర్ధాన్ని ఇస్తోన్న సందేశాలను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై గుజరాత్ లోని దళితులందరూ సంఘటితం కావాలని సూచించారు. పాఠ్య పుస్తకాల నుంచి వాటిని తొలగించేంత వరకూ పోరాటం చేయాలని మాయావతి పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను తాము ఖండిస్తున్నామని అన్నారు. గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని ఆమె తమ పార్టీ శ్రేణులకు సూచించారు.