మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్కు లైన్ క్లియర్... హస్తం పార్టీకి మాయావతి మద్దతు
Recommended Video
మధ్యప్రదేశ్లో అసెంబ్లీ పోరు నువ్వా నేనా అన్నట్లుగా జరిగింది. దాదాపు 21 గంటలకు పైగా కొనసాగిన కౌంటింగ్లో కాంగ్రెస్కు 115 సీట్లు రాగా బీజేపీకి 108 సీట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లో సమీకరణాలు మారుతూ వచ్చాయి. బుధవారం ఉదయం 5:30 గంటలకు రెండు పార్టీల ఓట్ షేరు 41శాతం దగ్గర ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 230 స్థానాలకు జరిగిన కౌంటింగ్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య తేడా 36,422 మాత్రమే. అంటే పోలింగ్ పోటా పోటీగా జరిగిందని భావించాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 116. అయితే రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ప్రభుత్వ ఏర్పాటులో వీరిదే అంతిమ నిర్ణయం కానుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఒక్క సీటు దూరంలో ఆగిపోవడంతో బీఎస్పీ సహకారం కోరుతూ ఆ పార్టీ నేతలతో మంతనాలు ప్రారంభించింది. అంతకుముందు బీజేపీకి తమ మద్దతు ఇచ్చేది లేదని బీఎస్పీ ప్రకటించింది. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ సిద్ధాంతాలు ఒకటే అనే సంకేతాలు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ మద్దతు కాంగ్రెస్కే ఇస్తున్నట్లు తెలపడంతో ఇక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్కు లైన్ క్లియర్ అయ్యింది.
కాంగ్రెస్ విధానాలతో చాలామటుకు తాము అంగీకరించనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీకి సహకరించాలని నిర్ణయించుకున్నట్లు మాయావతి తెలిపారు. ఒకవేళ రాజస్తాన్లో తమ మద్దతు కావాలని కాంగ్రెస్ కోరితే అక్కడ కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాయావతి ప్రకటించారు. బీఎస్పీ మధ్యప్రదేశ్లో రెండు, రాజస్థాన్లో 6 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ గవర్నర్కు కాంగ్రెస్ లేఖ రాసింది. అయితే ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందిగా గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ కూడా తన ప్రయత్నాల్లో మునిగిపోయింది.