కశ్మీర్కు ఎందుకు వెళ్లారు.. రాహుల్పై మాయావతి ఫైర్.. బీజేపీకి ఛాన్స్ ఇచ్చారంటూ..!
లక్నో : రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనపై దుమారం రేగుతోంది. అటు బీజేపీ నేతలు ఏకి పారేస్తుండగా.. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. జమ్ముకశ్మీర్లో ఇంకా శాంతియుత వాతావరణం కనిపించకముందే మీరు అక్కడకు ఎందుకు వెళ్లినట్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీకి, కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు మీరే అవకాశం ఇచ్చారంటూ ఫైరయ్యారు. కశ్మీర్కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించాల్సి ఉండేదని హితవు పలికారు.
రాహుల్ గాంధీకి మాయావతి చురకలు.. ఇప్పుడు అక్కడకు ఎందుకంటూ..!
కశ్మీర్ పర్యటనకు విపక్ష నేతలతో వెళ్లొచ్చిన రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణాస్త్రాలు సంధించారు. జమ్ముకశ్మీర్లో ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో మీరు అక్కడకు వెళ్లడం అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇటీవల కొందరు విపక్ష నేతలతో కలిసి ఆయన శ్రీనగర్కు వెళ్లిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఘటనపై మాయావతి స్పందిస్తూ పలు అంశాలు ప్రస్తావించారు.
అక్కడ ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదని.. ఈ సమయంలో మీరు అక్కడకకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనే వరకు విపక్ష నేతలు ఆగి ఉంటే బాగుండేదని హితవు పలికారు. కాంగ్రెస్ నేతగా రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశముందని ఆరోపించారు.
బీజేపీకి, కశ్మీర్ గవర్నర్ మాట్లాడటానికి మీరే అవకాశం ఇచ్చారంటూ ఫైర్
జమ్ముకశ్మీర్ పరిస్థితులపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో వాటిని ఖండిస్తూ వచ్చారు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. విపక్ష నేతలు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో.. వారు అక్కడకు వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొచ్చని సూచించారు. అదే క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
ఆ క్రమంలో వారందరినీ శ్రీనగర్ విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు కశ్మీర్ పర్యటనకు అనుమతించకుండా వెనక్కి పంపించారు. కశ్మీర్ అంశంలో బీజేపీ పక్కా ప్లాన్డ్గా ఉందని.. ఆ క్రమంలో మీ పర్యటనను పొలిటికల్ కాంట్రావర్సీగా మార్చేందుకు అవకాశం ఇచ్చారని.. కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు కూడా ఛాన్స్ ఇచ్చినట్లైందని ఆరోపించారు మాయావతి.
కశ్మీర్లో అలజడి.. ఆర్మీ వాహనం అనుకుని ట్రక్కుపై దాడి..!
అందుకే ఆర్టికల్ 370కి పార్లమెంటులో మద్దతిచ్చాం..!
ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను గుర్తు చేస్తూ పలు అంశాలు ప్రస్తావించారు మాయావతి. సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశ సార్వభౌమత పట్ల అంబేద్కర్ విశ్వాసం కలిగి ఉండేవారని.. అందుకే ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటులో బీఎస్పీ మద్దతు ప్రకటించిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 69 ఏళ్ల తర్వాత దేశ రాజ్యాంగం ఇప్పుడే కశ్మీర్లో కూడా అమల్లోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే కొంత సమయం పడుతుందన్నారు.
రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతలు కశ్మీర్ పర్యటనకు వెళ్లడం ముమ్మాటికీ తప్పేనంటూ వరుస ట్వీట్లతో మాటల తూటాలు పేల్చారు మాయావతి. అదలావుంటే ఇదివరకు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన మాయావతి.. తాజాగా రాహుల్ గాంధీకి సెటైర్లు వేయడం చర్చానీయాంశమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్ష నేతలు కశ్మీర్కు వెళ్లడం ద్వారా ఆ విషయాన్ని రాజకీయం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, కశ్మీర్ గవర్నర్కు అవకాశం ఇచ్చినట్లైందని.. అందుకే అక్కడకు వెళ్లకపోయి ఉంటే బాగుండేదన్నది తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు.