ఎంబీబీఎస్ కోర్సు ఫీజు భారీగా పెంపు: విద్యార్థుల ఆందోళన
భోపాల్: వచ్చే విద్యా సంవత్సరాల్లో ఎంబీబీఎస్ కోర్సు మరింత ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ ట్యూషన్ ఫీజును రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలు 33 శాతం నుంచి 53 శాతం వరకు పెంచుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లోని ది అడ్మిషన్ అండ్ ఫీస్ రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్ఆర్సి) ఆమోదం తెలిపింది.
ఈ పెరుగదల ప్రకారం.. ఎంబీబీఎస్ కోర్సులో తొలి ఏడాది చేరే విద్యార్థులు రూ. 5.72లక్షలు ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం ఫీజు రూ..5-4లక్షల వరకు ఉండటం గమనార్హం.
అంతేగాక, నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసేందుకు కొత్తగా ఏడాది కళాశాలల్లో చేరే విద్యార్థులు ఏకంగా 28లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇంకా, ఇందులో అక్రమ ఫీ క్యాపిటేషన్ లేకపోవడం గమనార్హం.
ఏఎఫ్ఆర్సి తాజా నిర్ణయం ప్రకారం.. 2016లో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులపై రానున్న మూడేళ్లలో కూడా ఈ ప్రభావం ఉండనుంది. 2019లో మరోసారి ఫీజు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. గత 6-7ఏళ్ల నుంచి పరిశీలించినట్లయితే ఫీజు దాదాపు 100శాతం పెరిగిపోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు.
ప్రైవేటు కళాశాలల విన్నపాలను పరిశీలించిన అనంతరం ఏఎఫ్ఆర్సి తాజా ఎంబీబీఎస్ కోర్సు ఫీజు పెంపునకు ఆమోదం తెలిపింది. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతితో యూనివర్సిటీలుగా మారిన ప్రైవేట్ కళాశాలల తాజా పీజులనే వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
నీట్ ద్వారా కూడా మెడికల్ కోర్సుల ప్రవేశం జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దేశంలోని ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలలు కూడా ఎంబీబీఎస్ ఫీజులను పెంచేశాయి. కాగా, మెరిట్ ఆధారంగా మెడికల్ కోర్సుల అడ్మిషన్ జరగాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఫీజుల పెంపుపై ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఏఎఫ్ఆర్సి నిర్ణయంపై ఆందోళనలు చేపడుతున్నారు. పాత ఫీజునే వసూలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల పెంపు కారణంగా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.