ఢిల్లీ మున్సిపల్ ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ జోరు... బీజేపీకి షాక్...
ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఐదు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో.. నాలుగు వార్డుల్లో ఆమ్ ఆద్మీ గెలిచింది. కాంగ్రెస్ ఒక వార్డును కైవసం చేసుకోగా... బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కళ్యాణ్పురి, రోహిణి, త్రిలోక్పురి, షాలిమార్ భాగ్ వార్డుల్లో ఆమ్ ఆద్మీ విజయం సాధించింది. చౌహాన్ భంగర్ వార్డును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఆమ్ ఆద్మీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 'హో గయా కామ్... జై శ్రీరామ్' అంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాలన పట్ల ప్రజలు నమ్మకం ఉంచారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. 'ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. 2015లో మేము 70 సీట్లకు 67 గెలిచాం. 2020లో 70కి గాను 62 సీట్లలో గెలిచాం. ఇక ఇప్పుడు ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే నాలుగింటిలో గెలిచాం. ప్రజలు మా పాలన కొనసాగాలని కోరుకుంటున్నారు.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
వచ్చే సంవత్సరం జరగబోయే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వెలువడుతాయని కేజ్రీవాల్ అన్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ... బీజేపీ పాలన పట్ల ఢిల్లీ ప్రజలు విసుగెత్తిపోయారని ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నలుగురు సిట్టింగ్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం,ఒక స్థానంలో బీజేపీ కౌన్సిలర్ మృతి చెందడంతో ఆ స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
Recommended Video
కాగా,వరుసగా నాలుగు దఫాలు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో బీజేపీ జెండానే ఎగిరింది. 2017 2017లో 272 స్థానాలకు గాను 184 స్థానాల్లో గెలుపొందింది. అంతకుముందు 2012లో 138 స్థానాలు గెలుచుకుంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ గెలిచినప్పటికీ... మున్సిపల్ కార్పోరేషన్పై బీజేపీ పట్టు మాత్రం సడల్లేదు. అయితే తాజా ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో వచ్చే సంవత్సరం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆమ్ ఆద్మీ ధీమాగా చెబుతోంది.