ఒకప్పుడు యోగిపై ఓడి.. ఇప్పుడు ఢిల్లీ సీఎంకే షాక్ ఇచ్చాడు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గెలుపు వెనుక కూడా పూర్వాంచల్ ఓటర్లు ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ: ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్పై పోటీ చేసి ఓడిపోయిన మనోజ్ తివారీ.. తాజా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం హైలైట్గా నిలిచారు. అప్పట్లో బీజేపీతో ప్రత్యర్థిగా తలపడ్డ ఆయన.. ఇప్పుడదే పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని మరీ గెలిపించడం విశేషం.
ఉత్తరప్రదేశ్లో 2009 లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ(సమాజ్ వాదీ) పార్టీ తరుపున మనోజ్ తివారీ యోగి ఆదిత్యనాథ్ పై పోటీ చేశారు. 1998 నుంచి గోరఖ్ పూర్ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్న యోగిపై ఆయన గెలుపు సాధ్యపడలేదు. ఆ ఎన్నికల్లో మనోజ్ తివారీ ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత బీజేపీకి మనోజ్ తివారీ దగ్గరవడం.. ఆరు నెలల క్రితమే ఆయన్ను ఢిల్లీ పార్టీ చీఫ్ గా నియమించడం కలిసొచ్చింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన క్షేత్రస్థాయిలో చాలానే శ్రమించారు. అందరిని కలుపుకుని పోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
పదేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత చాలానే పెరిగింది. ఆ వ్యతిరేకతను తుడిచిపెట్టి ప్రజలు పార్టీ నుంచి దూరం కాకుండా చూడటంలో మనోజ్ తివారీ సక్సెస్ అయ్యారు.
అంతేకాదు, మనోజ్ తివారీ భోజ్ పురి స్టార్ కూడా కావడం ఆయనకు కలిసొచ్చిన మరో అంశం. ఢిల్లీలో ఉత్తరప్రదేశ్కు చెందిన పూర్వాంచల్ ఓటర్లు ఎక్కువగా ఉండటం, భోజ్పురి స్టార్గా వారిలో మనోజ్ తివారీకి మంచి పాపులారిటీ ఉండటం బీజేపీ విజయానికి దోహదం చేసింది.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గెలుపు వెనుక కూడా పూర్వాంచల్ ఓటర్లు ఉండటం గమనార్హం. ఈశాన్య ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో మనోజ్ తివారీ గట్టిగానే ప్రచారం చేశారు. ఢిల్లీలోని 270వార్డులకు గాను 250వార్డుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మొత్తం మీద బీజేపీకి వరుసగా మూడోసారి విజయాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.