ప్రత్యేక న్యాయ స్థానం సంచలన తీర్పు..! రాజద్రోహం కేసులో వైకోకు ఏడాది జైలుశిక్ష..!!
చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాజకీయాల్లో మరో కుదపు చోటుచేసుకుంది. రాజద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైకోకు ప్రత్యేక కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది. దీంతో పాటు పదివేల రూపాయల జరిమానాను సైతం విధించింది. అయితే దీనిపై అప్పీల్ చేసుకోడానికి గడువు కోరడంతో కోర్టు ఒకనెల గడువును మంజూరు చేసింది. ఈ కేసు నేపథ్యం గురించి ఒక సారి తెలుసుకుందాం.
2009 లో శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంలో వైకో ఓ పుస్తకావిష్కరణలో ప్రసంగిస్తూ ఎల్టీటీఈకి తాను మద్దుదారునని ఆ సభలో ప్రకటించుకున్నారు. దీంతో చెన్నై పోలీసులు 124 (ఏ) మరియు 153 (ఏ) సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన మే నెలలో కోర్టుకు హాజరయ్యారు కూడా. ఈ విషయంలో ఆయనపై పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేయడంతో 2009 లో అరెస్టు చేయగా, 2017 లో ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కొంత కాలం తర్వాత ఈ కేసును ఆ కోర్టు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసింది.
ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించడంపై వైకో స్పందిస్తూ... మరిన్ని నెలల జైలుశిక్ష విధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2009 లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో తాను తమిళ ఈళం గురించి మాట్లాడానే కానీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన అన్నారు.
ఈ విషయంపై గతంలో పార్లమెంటులో కూడా తాను ప్రస్తావించానని, ఈ విషయంపై మినహాయింపును అడిగే ప్రసక్తే లేదని వైకో తేల్చి చెప్పారు. నిత్యం ప్రజల పక్షాన నిలబడి,ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే వైకో లాంటి చురుకైన నేతకు శిక్షఖరారు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. చెన్నైలోని వైకో ఇంటి పరిసరాలు అభిమానుల తాకిడితో కోలాహలంగా మారింది.