గర్ల్స్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!
రోహ్తక్ : డ్రోన్ కెమెరా చక్కర్లు విద్యార్థుల ఆందోళనకు కారణమైంది. హాస్టల్ చుట్టూ తిరుగుతూ తమ గదులను సదరు డ్రోన్ కెమెరా దృశ్యాలను చిత్రీకరిస్తోందని ఆరోపిస్తూ వందలాది విద్యార్థినులు ఆందోళనకు దిగిన ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. హర్యానా రోహ్తక్ ప్రాంతంలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినులు చదువుకుంటున్నారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న హాస్టల్లో ఉంటున్నారు. అయితే ఇటీవల ఓ డ్రోన్ కెమెరా తమ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొడుతోందని.. ఆ క్రమంలో తమ గదులను చిత్రీకరిస్తోందని విద్యార్థినులు ఆరోపించారు.
లేడీస్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు..!
డ్రోన్ కెమెరా అలజడితో విద్యార్థినులు అలర్టయ్యారు. ఆ మేరకు వర్సిటీ అధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదంతా ట్రాష్ అని.. డ్రోన్ తిరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అది విమానమని తేలిగ్గా చెప్పారు. రాత్రి వేళల్లో డ్రోన్ కెమెరా తిరుగుతోందని ఎంత మొత్తుకున్నా వారు పట్టించుకోలేదు. చివరకు చేసేదేమీ లేక విద్యార్థినులు నిరసనకు దిగారు.
అధికారుల తీరుతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. తాము చెప్పింది వినకుండా, నమ్మకుండా విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అటు పోలీసులు కూడా తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని విద్యార్థినులు వాపోయారు.
మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్లైన్ షాపింగ్ లీలలు..?
డ్రోన్ కాదంటూ.. విమానమని వర్సిటీ అధికారుల బుకాయింపు..!
మహర్షి దయానంద్ యూనివర్సిటీకి చెందిన గర్ల్స్ హాస్టల్లో దాదాపు రెండు వేలకు పైగా విద్యార్థినులు ఉంటున్నారు. కొంతకాలంగా హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా తిరుగుతోందని అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు లైట్గా తీసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అటు అధికారులు గానీ, ఇటు పోలీసులు గానీ అది డ్రోన్ కాదని విమానమంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. ఆ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు హాస్టల్ చుట్టూ మరోసారి డ్రోన్ కెమెరా తిరిగిందని.. దానికి సాక్ష్యాలుగా తాము తీసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని చెప్పినా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు.
డ్రోన్ చక్కర్లు కొట్టినప్పుడు ఫోటోలు తీశామంటున్న విద్యార్థినులు..!
అయితే పోలీసులు దర్యాప్తు చేయడానికి వచ్చిన సమయంలో డ్రోన్ కనిపించలేదనేది వారి వాదనగా కనిపిస్తోంది. పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ డ్రోన్ కెమెరా హాస్టల్ చుట్టూ తిరుగుతోందని అంటున్నారు విద్యార్థినులు. అయితే వర్సిటీ అధికారుల తీరును ఎండగడుతూ హాస్టల్ గేటు ఎదుట పెద్దసంఖ్యలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి లేడీస్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టిన అంశం వివాదస్పదంగా మారింది. విద్యార్థినులకు భద్రత లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ అధికారులు ఈ విషయాన్ని చిన్నగా చూస్తుండటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.