జెన్హువా డేటా లీక్: గూఢచర్యంపై చైనాను నిలదీసిన విదేశాంగ శాఖ, అదేంలేదంటూ డ్రాగన్
న్యూఢిల్లీ/బీజింగ్: చైనాకు చెందిన కంపెనీ జెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూఢచర్యం చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై చైనా రాయబారిని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం నిలదీసింది. భారతదేశంలోని ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని ఈ కంపెనీ సేకరించి చైనాకు చేరవేస్తోందని మీడియాల్లో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
గూఢచర్యంపై కమిటీ వేసిన కేంద్రం..
కాగా, జెన్హువా ఒక ప్రైవేటు కంపెనీ అని, ఇది అందరికి తెలిసిన విషయమేనని చైనా పేర్కొంది. అయితే, భారతీయ పౌరుల సమాచారాన్ని వారికి తెలియకుండా ఈ కంపెనీ సేకరిస్తుందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం లోతుగా విచారిస్తోంది. అంతేగాక, ప్రభుత్వం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ కింద ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిందా? అలా అయితే, అందుకు సంబంధించిన వివరాలను 30 రోజుల్లోగా తెలియజేయాలని స్పష్టం చేసింది.
చైనా కంపెనీ డేటా చోరీ చేస్తోందంటూ..
చైనా కంపెనీల గూఢచర్యం నుంచి భారతీయ నాయకులు, ఇతర ప్రముఖుల సమాచారాన్ని సురక్షితం చేయాలంటూ కేసీ వేణుగోపాల్ సహా ఇతర ఎంపీల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎంపీ కేసీ వేణుగోపాల్కు కూడా తెలియజేసినట్లు సమాచారం. కాగా, భారతదేశంలోని 10వేల మందికిపైగా ప్రముఖ వ్యక్తులు, సంస్థల డేటాను ఈ చైనా కంపెనీ సేకరించిందని, ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సహా ఇతర ఎంపీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అలాంటిదేం లేదు.. అంతా అవాస్తం: చైనా వాదన
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిది వాంగ్ వెన్బిన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆ కంపెనీ చెప్పిందన్నారు. అది ఒక ప్రైవేటు కంపెనీ, దాని క్లైంట్లు అందరూ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్, బిజినెస్ గ్రూప్స్ అని తెలిపారు. ఆ కంపెనీ డేటాను సేకరించడం లేదని, ఆన్లైన్లో ఉన్న డేటాను మొబిలైజ్ చేస్తోందని చెప్పుకొచ్చారు. అన్ని సైబర్ నేరాలకు చైనా వ్యతిరేకమని తెలిపారు. తాము ఇతర దేశాలతో సామరస్యపూర్వకమైన, భద్రమైన, సహకారపూరిత సైబర్ స్పేస్ను కోరుకుంటామని చెప్పారు.