అణగతొక్కేస్తాం.. జాగ్రత్త, ఐబి ఇంఛార్జ్ని: షిండే హెచ్చరిక
ముంబై: అణగతొక్కేస్తాం... జాగ్రత్త అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియాను హెచ్చరించారు. ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియా కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని షిండే ఆగ్రహించారు. దానిని అణగతొక్కేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు.
షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో పర్యటించారు. సాయంత్రం యువజన కాంగ్రెసు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాపై ఎలక్ట్రానిక్ మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు రాతలు రాస్తున్న మీడియాను అణచివేస్తామంటూ హెచ్చరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
కాంగ్రెస్ పార్టీపై పనిగట్టుకొని ఒక వర్గం మీడియా రెచ్చగెట్టేరీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు నెలలుగా ఎలక్ట్రానిక్ మీడియాలోని ఓ వర్గం తనను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలను వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ తరహా తప్పుడు వార్తల ప్రసారాలను ఆపకుంటే సదరు మీడియా సంస్థలను అణచి వేయడానికి వెనకాడమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం జరుగుతోందో తనకు చాలామట్టుకు తెలుస్తోందని, గత కొన్ని నెలల్లో మీడియా తమ పార్టీని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తోందని, అధారాలులేని వార్తలను ఆపకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలోని అటువంటి శక్తులను అణిచివేస్తామన్నారు.
ఇంటిలెజిన్స్ విభాగం తన అధికార పరిధిలో ఉంటుందని, అలాంటి తప్పుడు ప్రచారం ఎవరుచేస్తున్నారో తనకు తెలుసునని, దీని వెనుక కొన్ని శక్తులున్నాయని షిండే తెలిపారు. రానున్న లోకసభ ఎన్నికల దృష్ట్యా ఇటీవల చేపట్టిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలను మీడియా వెల్లడిస్తూ కాంగ్రెస్ పాలనను విమర్శించిన నేపథ్యంలో షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. షిండే వ్యాఖ్యలపై పలువురు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, మీడియాపై హెచ్చరికలపై షిండే వివరణ ఇచ్చారు. తాను మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని చెప్పారు. సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకొని మాట్లాడానని చెప్పారు.