ఎక్కడ?: గణపతికి నైవేద్యంగా మంసాహారం, మద్యం!
బెంగళూరు: సాధారణంగా వినాయక చవితి పండుగ అంటే అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో 9రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. వేడుక సందర్భంగా మద్యం, మంసానికి దూరంగా ఉంటారు. పూజల్లో బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్లు, నానుబియ్యం, పప్పు, కూరగాయలు వండి నైవేద్యం పెడతారు. భక్తులు కూడా ఆ వంటలే తింటారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే 9 రోజులపాటు ఇదే నిష్ఠ పాటిస్తారు.
దాదాపు అంతటా ఈ సంప్రదాయమే కొనసాగుతూ వస్తోంది. కానీ, కర్ణాటకలోని ఒక ఊరిలో మాత్రం వింత ఆచారం అమలులో ఉంది. కొప్పల్ జిల్లాలోని భాగ్యనగర్ గ్రామంలో క్షత్రియుల్లో ఒక వర్గానికి చెందిన వారు వినాయక చవితి తర్వాత మూడో రోజు నుంచి ఐదో రోజు వరకు గణపతికి మాంసాహారం, మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.
ఒక రోజు చికెన్, మరో రోజు మటన్, తర్వాత చేపలు ఇలా రోజుకో రకం మాంసాహారం పెడుతారు. ఏకదంతుని విగ్రహం ముందు చికెన్, విస్కీలు పెట్టి పూజిస్తారు. మద్యాన్ని విగ్రహంపై చల్లుతారు. ఇదేమంటే.. తరతరాలుగా తామీ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆ వర్గం వారు తెలిపారు.
కాగా ఈ విధంగా పూజ చేస్తేనే స్వామివారు తమను చల్లగా చూస్తాడని వారి నమ్మకం. అయితే ఇదంతా ఇళ్లలోనే చేస్తారు. వీధుల్లో వినాయక పూజకు మాత్రం మిగతా అందరిలాగే ఫక్తు శాకాహార నైవేద్యాలే పెడుతారు. ఆ గ్రామంలో ఆ ఒక్క వర్గానికి చెందిన దాదాపు వంద కుటుంబాల వారే ఈ రకమైన పూజలు చేయడం గమనార్హం.