మక్కా ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి
దుబాయ్: మక్కా మసీదులో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు హైదరాబాదీలు ఉన్నారు. పాతబస్తీ భవానీనగర్కు చెందిన షేక్ ముజీబ్, బజార్ఘాట్కు చెందిన అనీఫ్ దంపతులకు గాయాలయ్యాయని తెలంగాణ హజ్ కమిటీ అధికారులు తెలిపారు.
మక్కా మసీదులో భారీ క్రేన్ కూలడంతో 107 మంది మరణించిన విషయం తెలిసిందే. మక్కా మసీదు వద్ద పరిస్తితిని జెడ్డాలోని భారత కాన్సులేట్ పర్యవేక్షిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. మక్కా మసీదు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు (గ్రాండ్ మాస్క్)లో భారీ క్రేన్ కూలిపోవడంతో 107 మంది మరణించారు. దాదాపు 230 మంది గాయపడ్డారు. శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోయింది.
మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ క్రేన్ నేలకొరిగింది. క్రేన్ విరుచుకుపడటంతో మసీదు పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. క్రేన్ భాగాలు పైనుంచి కిందికి వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ట్విట్టర్లో షేర్ అవుతున్నాయి. సహాయ సిబ్బంది, వైద్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లారు.