నా భార్యతో తేడాలంటారేమో: మీడియాపై భగ్గుమ్న కేజ్రీ
ఓ వీడియోను ఆసరా చేసుకుని తనతో కుమార్ విశ్వాస్కు విభేదాలున్నాయంటూ మీడియా రాసిన వార్తాకథనాలపై అరవింద్ కేజ్రీవాల్ భగ్గుమన్నారు.
న్యూఢిల్లీ: తమ పార్టీ నేత కుమార్ విశ్వాస్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తానెప్పుడు కూడా విశ్వాస్పై ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెప్పారు కుమార్ విశ్వాస్ పార్టీ సభ్యుడు మాత్రమే కాదని అన్నారు.
విశ్వాస్ తన కుటుంబంలో ఒకరని, విశ్వాస్కూ తనకూ మధ్య విభేదాలు మీడియా సృష్టేనని మండిపడ్డారు. రేపొద్దున తన భార్య కూడా తనతో విభేదించినట్లు రాస్తారేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వీడియో క్లిప్ను ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇటీవల కుమార్ విశ్వాస్ అడ్రస్ టు కంట్రీమెన్ పేర 13 నిమిషాల వీడియోను పోస్టు చేశారు. అందులో ఆయన కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వరకు పలు విషయాల గురించి మాట్లాడారు. అవినీతి నియంత్రణ నుంచి ఆప్ ప్రభుత్వం తన మనుషులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ వీడియో షాన్దార్ (అద్భుతం) అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను ఆ వీడియోను పోస్టు చేయాలని కుమార్ విశ్వాస్కు చెప్పానని, దానివల్ల ప్రజలు దేశ పరిస్థితి గురించి అర్థం చేసుకుంటారని తాను భావించానని ఆయన అన్నారుట.
"మోడీ, మోడీ... అరవింద్, అరవింద్... రాహుల్ రాహుల్ అంటూ పొలిటికల్ బాస్ల పేర్లను స్మరిస్తూ మనం దేని గురించి కూడా ఆందోళన చెందుతున్నట్లు లేం. ఇందిరా ఈజ్ ఇండియా... మోడీ రాజ్ ఆ గయా... ఎకె రాజ్ ఆ గయా.. ఈ విధమైన వ్యవహారం ఎక్కువ కాలం సాగదు" అంటూ కుమార్ విశ్వాస్ ఆ వీడియోలో అన్నారు
ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి వస్తుంటాయి... పోతుంటాయని, ఈ భవంతులు పిఎం హౌస్, సిఎం హౌస్ తాత్కాలికమని, అందువల్ల మీరంతా మీ గూడుల్లోంచి బయటకు వచ్చి... కార్యాచరణకు దిగాలని ఆయన అన్నారు.