అదో దండగమారి మధ్యవర్తిత్వ కమిటీ: సుబ్రహ్మణ్యస్వామి, మంచి పరిణామం అంటోన్న మాయావతి
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీపై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. కమిటీ ఏర్పాటు పట్ల పలు హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు తప్పు పడుతున్నారు. ఇదివరకే ఈ భూమి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. బంతి కేంద్రం కోర్టులో ఉంటుందే తప్ప సుప్రీంకోర్టు పరిధిలో కాదంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు సమర్థించాయి. సుప్రీం తీర్పును స్వాగతించాయి.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?
మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు వ్యర్థ ప్రయాస
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై ముందు నుంచీ క్షుణ్నంగా అధ్యయనం చేస్తూ వస్తోన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒకరోజు ముందే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ నియామకానికే మొగ్గు చూపుతుందంటూ వచ్చిన వార్తలపై ఆయన గురువారమే స్పందించారు. కమిటీ ఏర్పాటు వ్యర్థమని చెప్పుకొచ్చారు. ఈ కమిటీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, ఎలాంటి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించదని చెప్పారు.
సున్నీ వక్ఫ్ బోర్డు కూడా స్వాధీనం చేసుకోలేదు..
అయోధ్య భూవివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఇదివరకే ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆ వ్యవస్థకు లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. చివరికి ఈ కేసును సున్నీ వక్ఫ్ బోర్డు గెలిచినప్పటికీ.. వాళ్లు కూడా భూమిని స్వాధీనం చేసుకోలేరని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అంతగా అవసరమైతే నష్ట పరిహారాన్ని మాత్రమే సున్నీ వక్ఫ్ బోర్డు పొందగలదని తేల్చి చెప్పారు.
హిందువులు భూమిని ఇచ్చినట్టుగా రికార్డులు..
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి అవసరమైన భూమిని హిందువులు అప్పటి పాలకులకు దానం ఇచ్చినట్టుగా రికార్డులు ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఈ విషయం పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చిందని అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను పీవీ ప్రభుత్వం సేకరించి, భద్రపరిచిందని చెప్పారు.
మంచి పరిణామం: మాయావతి
రామజన్మభూమి- బాబ్రీమసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ సమర్థించాయి. ఇది శుభ పరిణామం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. భూ వివాదాన్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని మాయావతి అన్నారు. రెండు వర్గాల ప్రజల మధ్య గాయపడ్డ సంబంధాలకు మందుగా ఇది ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదో చారిత్రక అవకాశం: సల్మాన్ ఖుర్షీద్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించడానికి లభించిన చారిత్రక అవకాశమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. దేశంలో మత సామరస్యాన్ని పునరుద్ధరించే దిశగా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించిందని చెప్పారు. మధ్యవర్తిత్వ కమిటీ వల్ల ఒకరు ఓడిపోతారని, మరొకరు గెలుస్తారని అనుకోవడానికి వీల్లేదని అన్నారు. గెలుపోటములకు అతీతంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు.