ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..
ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. వివాద పరిష్కారానికి మరింత సమయం కావాలన్న కమిటీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. ఈ మేరకు సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..
ఆరు నిమిషాల విచారణ
అయోధ్య భూవివాదంపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన అంశాలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక అందిందని న్యాయస్థానం ప్రకటించింది. కేవలం ఆరు నిమిషాల పాటు సాగిన విచారణలో ముస్లింల తరఫు ప్రతినిధులు మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధమని కోర్టుకు తెలిపారు. అయితే నిర్మోహి అఖాడా మాత్రం ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదన్న అంశాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చింది.
త్రిసభ్య కమిటీ పనితీరుపై సంతృప్తి
సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ పనితీరుపై న్యాయస్థానం సంతృప్తి వ్యక్తంచేసింది. మతపరంగానే కాక రాజకీయంగానూ సున్నితమైన ఈ అంశాన్ని కమిటీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుందని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. కేసులో ఇరు పక్షాలు జూన్ 30లోగా తమ అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని సూచించింది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం
అయోధ్యలో 2.77ఎకరాల భూమికి సంబంధించి దశాబ్దాలుగా పంచాయితీ నడుస్తోంది. ఆ స్థలం తమదంటే తమదంటూ సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాలు కోర్టుకెక్కాయి. 2010లో కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాతో పాటు రామ్లల్లాకు సమానంగా పంచాలని ఆదేశించింది. ఈ తీర్పును 14మంది సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరుపుతున్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ మార్చి 8న నిర్ణయం తీసుకుంది.