'తలమీద ముసుగు, శిలువ లేకుండా పరీక్ష రాయను'
తిరువనంతపురం: ముసుగు, మెడలో శిలువ తీసి పరీక్ష రాయాలని కళాశాల ప్రిన్సిపల్ ఆదేశించడంతో ఆల్ ఇండియ్ ప్రీ మెడికల్ పరీక్ష (ఏఐపీఎంటి) రాయకుండా వెనుదిరిగింది ఓ క్రైస్తవ మత సన్యాసిని. చెవి దుద్దులు, ముక్కు పుడకలు, బురఖా ధరించి ఈ పరీక్షలకు హాజరు కావొద్దని సిబిఎస్ఈ నిబంధనలు విధించింది.
తలమీద ఉండే వస్త్రం, శిలువ గుర్తును తొలగించి పరీక్ష రాసేందుకు నిరాకరిస్తూ కేరళకు చెందిన సదరు నన్ శనివారం జరిగిన అఖిల భారత ముందస్తు వైద్య ప్రవేశపరీక్ష (ఐఏపీఎంటీ) రాయలేదు.
సైబా శనివారం ఉదయం ఇక్కడి జవహర్ సెంట్రల్ స్కూల్ కేంద్రానికి వచ్చి తలమీదుగా వస్త్రాన్ని, మెడలో శిలువను ధరించి ప్రవేశ పరీక్ష రాసేందుకు అనుమతించాల్సిందిగా అధికారులను అభ్యర్థించారు.
అయితే, సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం తాము అందుకు అనుమతించలేమంటూ పాఠశాల అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. తాను కూడా క్రైస్తవ మతస్తురాలినేనీ, సైబా విశ్వాసాన్ని అర్థం చేసుకోగలననీ కానీ, సీబీఎస్ఈ నిబంధనల ఉల్లంఘన కుదరదనీ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
పలు పరీక్షా కేంద్రాల వద్ద పలువురు విద్యార్థులు తమ తలమీదుగా ధరించి ఉన్న స్కార్ఫ్లు, చెవిపోగులు తదితరాలన్నిటినీ తొలగించుకోవడం కనిపించింది. పూర్తిగా తనిఖీలు చేసిన మీదటే విద్యార్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించారు. తలమీద ధరించి స్కార్ప్తో పరీక్ష రాసేందుకు ముస్లిం విద్యార్థులను అనుమతించాలంటూ ఇస్లామిక్ సంస్థ దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం శుక్రవారం తోసిపుచ్చింది.