మధ్యప్రదేశ్ పోలీసు శాఖ నిర్వాకం: ఒకే గదిలో స్త్రీ, పురుష అభ్యర్ధులకు మెడికల్ పరీక్షలు
భోపాల్: పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. ఒకే గదిలో పురుష, మహిళా అభ్యర్ధులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహిళా అభ్యర్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో కనీసం ఒక్క మహిళా ఉద్యోగి కూడ లేకపోవడం వివాదాస్పదంగా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగాల నియామకం కోసం పరీక్షల నిర్వహణ సమయంలో అభ్యర్ధుల ఛాతీపై కులం పేరు రాయడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి. విపక్షాలు ఈ విషయమై ప్రభుత్వ తీరును ఎండగట్టాయి.
ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు కూడ ఆదేశించింది. ఈ తరుణంలో ఇదే తరహ ఘటన మరోకటి వెలుగు చూసింది. పోలీసు ఉద్యోగాల కోసం అభ్యర్ధులకు వైద్య పరీక్షలు నిర్వహణలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చింది.
పోలీసు ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్దుల్లో పురుషులు, మహిళా అభ్యర్ధులకు ఒకే గదిలో పరీక్షలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం నాడు స్త్రీ, పురుష అభ్యర్ధులకు ఒకే గదిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
పరీక్ష నిమిత్తం కొందరు యువకులు తమ దుస్తులు విప్పదీస్తున్న వీడియో బయట పడడంతో ఈ విషయం వెలుగుచూసింది. మహిళా అభ్యర్థుల మెడికల్ పరీక్ష కూడా అదే గదిలో అదే సమయంలో నిర్వహించారు. అయితే మహిళా అభ్యర్దులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కనీసం అక్కడ ఒక్క మహిళా డాక్టరు గానీ, నర్సు గానీ అందుబాటులో లేరు.
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని భింద్ జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ అజిత్ మిశ్రా చెప్పారు. ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులకు నోటీసులు జారీ చేసినట్టు ఆయన చెప్పారు.