షాకింగ్ : ఏసీలో 40 పాము పిల్లలు.. గుండెలు అదిరిపోయే సీన్...
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఇంటి ఏసీ పైపులో ఏకంగా 40 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ ఇంటి సభ్యుల గుండెలు అదిరిపోయాయి. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున జనం ఆ ఇంటికి వచ్చారు. పాము పిల్లలను చూసేందుకు వారంతా ఎగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలమే రేపింది.
ఉత్తరప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ,రాహుల్ దిగ్భ్రాంతి
వివరాల్లోకి వెళ్తే.. మీరట్ జిల్లాలోని కంకర్ఖేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పవ్లీ ఖుర్ద్ అనే గ్రామంలో శర్దానంద్ అనే రైతు కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి శర్దానంద్ తన గదిలోకి వెళ్లగా ఫ్లోర్పై ఒక పాము పిల్ల కనిపించింది. వెంటనే దాన్ని దూరంగా పడేసి వచ్చాడు. ఆ తర్వాత పడుకునేందుకు తన బెడ్ పైకి వెళ్లగా.. అక్కడ మరో మూడు పాము పిల్లలు కనిపించాయి. అదే సమయంలో ఏసీ వైపు చూడగా.. దాని పైపు నుంచి మరికొన్ని పాము పిల్లలు కిందకు జారడం కనిపించింది.
కుటుంబ సభ్యులను పిలిచి.. ఆ ఏసీని ఓపెన్ చేసి చూడగా.. అందులోని పైపులో దాదాపు 40 పాము పిల్లలు కనిపించాయి. దీంతో శర్దానంద్ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. విషయం ఆ నోటా.. ఈ నోటా... ఊరంతా పాకింది. దీంతో గ్రామస్తులంతా ఆ పాము పిల్లలను చూసేందుకు ఎగబడ్డారు. శర్దానంద్ కుటుంబం వాటన్నింటిని ఓ సంచిలో వేసి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు సమాచారం.
ఘటనపై స్థానిక వెటర్నరీ డాక్టర్ డా.ఆర్కే వత్సల్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా ఆ ఎయిర్ కండిషనర్ ఉపయోగంలో ఉండి ఉండకపోవచ్చునని,అందుకే పాము అందులోకి చొరబడి గుడ్లు పెట్టి ఉండవచ్చునని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం సహజంగానే ఉంటుందన్నారు. కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.