hospital discrimination:కరోనా వైరస్ పరీక్ష రిపోర్ట్ చూపించండి, నెగిటివ్ అయితే ఓకే., కేసు..
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో భయాందోళన నెలకొనగా.. ఉత్తరప్రదేశ్లో ఓ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం మత వివక్షను వెల్లగక్కింది. వైద్యం చేసేప్పుడు మత వివక్ష చూపించొద్దు.. కానీ వారు డిఫరెన్స్ చూపించడమే గాక న్యూస్ పేపర్లో యాడ్ కూడా వేశారు. ఘటనపై యూపీ వైద్య ఉన్నతాధికారులు కూడా సీరియస్గానే స్పందించారు.
ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకం..
యూపీలోని మీరట్లో ఓ క్యాన్సర్ ఆస్పత్రి ఉంది. ఇంచొలి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న ఆస్పత్రిలో 50 పడకల సామర్థ్యం ఉంది. అయితే శుక్రవారం రోజున ప్రముఖ హిందీ పత్రికలో ఇచ్చిన యాడ్ ఓ మతాన్ని కించపరిచేలా ఉంది. ముస్లిం రోగులు, వారి సంరక్షకులు ఆస్పత్రికి తప్పకుండా వచ్చి కరోనా వైరస్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. ఒకవేళ వారికి కరోనా వైరస్ నెగిటివ్ వస్తే ఆ రిపోర్ట్ తీసుకొని రావాలని కోరింది. దానిని రుజువుగా భావించి ఆస్పత్రిలో చేర్చుకుంటామని తెలిపింది. లేదంటే చేర్చుకోబోమని తేల్చిచెప్పింది.
అలా సోకింది..?
ఢిల్లీలో జరిగిన ప్రార్థనలతోనే కరోనా వైరస్ పెరిగిందని కూడా యాడ్లో ప్రస్తావించింది. జమాత్కు వెళ్లొచ్చి వైరస్ సోకిన వారు వైద్య సిబ్బందితో తప్పుగా ప్రవర్తించడం సరికాదు అని హితవు పలికింది. అత్యవసర పరిస్థితి ఉన్న వారు.. కరోనా వైరస్ కోసం రూ.4500 చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. అయితే ఆస్పత్రికి చెందిన ముస్లిం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నుంచి మాత్రం వసూల్ చేయబోమని తెలిపింది.
సారీ...
హిందువు, జైన్ కుటుంబాలు లోభులు అని.. కరోనా వైరస్ కోసం పీఎం కేర్స్ ఫండ్కు నిధులు ఇవ్వాలని ఆ యాడ్లో కోరింది. కానీ జైనుల నుంచి వ్యతిరేకత రావడంతో క్షమాపణ కోరినట్టు సదరు పత్రిక శనివారం వివరణ ఇచ్చింది. కానీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విశేషం. కరోనా వైరస్పై పోరడాలని హిందు, ముస్లిం, జైన్, సిక్, క్రిస్టియన్లను కూడా కోరింది.
పర్మిషన్ రద్దు..?
వాస్తవానికి ఆస్పత్రుల్లో ఎలాంటి మత వివక్ష ఉండకూడదు. చూపించకూడదు. కానీ ఏకంగా యాడ్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. చేసిన తప్పుకు క్షమాపణ కోరాలని.. లేదంటే ఆస్పత్రి పర్మిషన్ రద్దు చేస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్ స్పష్టంచేశారు.