ఇది చాలా అరుదైన సందర్భం: భర్త స్థానంలో కమిషనర్గా భార్య!
భర్త సతీశ్ బినో, తానూ ఒకే బ్యాచ్ కు చెందినవారమని తెలిపారు. ట్రైనింగ్ సమయంలోను స్త్రీ పురుష బేధాలు ఉండేవి కాదని చెప్పారు. ఇద్దరం ఎలా తర్ఫీదు పొందామో అంతే సామర్థ్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఇదివరకు ఆ స్థానంలో ఆమె భర్త కమిషనర్గా బాధ్యతలు నిర్వహించేవాడు. కానీ ఇప్పుడామే ఆ స్థానాన్ని భర్తీ చేసింది. కేరళలోని కొల్లాం పట్టణంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు కొల్లాం పట్టణ పోలీస్ కమిషనర్గా పనిచేసిన సతీశ్ బినో స్థానంలో ఇప్పుడాయన సతీమణి అజీతా బేగం నియమితులయ్యారు.
ఇటీవల సతీశ్ బినోకు పదోన్నతి లభించడంతో.. ఆయన ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో యాథృచ్చికంగా ఆ స్థానం ఆయన సతీమణికే దక్కింది. దీనిపై స్పందించిన అజీతా బేగం.. ఇది చాలా సాధారణ విషయమన్నారు. ఇంతకు ముందు నాలుగు జిల్లాల్లో పనిచేశానని.. కానీ అక్కడితో పోల్చితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన దగ్గర మీడియా ఫోకస్ ఎక్కువగా ఉందని చెప్పారు.
భర్త సతీశ్ బినో, తానూ ఒకే బ్యాచ్ కు చెందినవారమని తెలిపారు. ట్రైనింగ్ సమయంలోను స్త్రీ పురుష బేధాలు ఉండేవి కాదని చెప్పారు. ఇద్దరం ఎలా తర్ఫీదు పొందామో అంతే సామర్థ్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా సాధారణమేనని, అయితే ఒకే జిల్లాలో భార్య భర్తలు పనిచేయడం మాత్రం అరుదైన విషయమన్నారు.
కాగా, ఈ ఐపీఎస్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే ప్రసూతి సెలవును ముగించుకుని అజీతా డ్యూటీలో చేరారు. ఐపీఎస్ అధికారులుగాను, అటు తల్లిదండ్రులుగాను ఒకే సమయంలో రెండు బాధ్యతలు నిర్వహించడం కష్టమైనప్పటికీ.. బలమైన సంబంధాలతో తమను మిస్ అవుతున్న భావన రానివ్వమన్నారు. ప్రస్తుతం అజీతా బేగం భర్త సతీవ్ బినో పతానంతిట్ట జిల్లా పోలీస్ చీఫ్ గా నియమితులయ్యారు.