మౌనాన్ని బద్దలుకొట్టాడు: 'నెలసరి' ఇక సమస్య కాదు, అదేమి రహస్యమూ కాదు..
ఎదిగిన ఆడపిల్ల శరీరాన్ని, వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో సమాజం ఇప్పటికీ మరుగుజ్జు దశలోనే ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇప్పటికీ నెలసరి అంటే అదో రకమైన ఆందోళన. ఆ ఐదు రోజులు వాళ్లు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లోవాళ్లకు కనిపించకుండా 'ముట్టుబట్ట'ను దాచుకోవడానికి వారు పడే ఇబ్బంది మాటల్లో వర్ణించలేనిది.
ఎదిగిన ఆడపిల్ల శరీరాన్ని, వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో సమాజం ఇప్పటికీ మరుగుజ్జు దశలోనే ఉంది.ప్రకృతి సిద్దంగా వారిలో చోటు చేసుకునే శారీరక మార్పులను సైతం చుట్టూ ఉన్న సమాజం హేళన చేసే రీతిలో చూస్తుందంటే.. భారతీయ సమాజం ఇంకా ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికీ మెడికల్ షాపుకు వెళ్లి నలుగురి ముందు సానిటరీ నాప్కిన్స్ కొనుగోలు చేయాలంటే.. తెలియని ఇబ్బందేదో అమ్మాయిలను వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను సాంఘీకంగాను, ఆర్థికంగాను అర్థం చేసుకున్న మహేష్ ఖండెల్ వాల్ అనే వ్యక్తి దీనికొక శాశ్వత పరిష్కారం కనిపెట్టే దిశగా అడుగేశాడు. రహస్యంగా ఉంచాలన్న న్యూనత భావం నుంచి.. మహిళలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. అటు సాంఘీకంగా వారిలో చైతన్యం కల్పించడంతో పాటు.. ఇటు ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాడు. ఆయన చేసిన కృషి ఈనాడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని నిలబెడుతుందనడంలో అతిశయోక్తి లేదు.
ఎలా పుట్టింది ఆలోచన:
ఒకానొక సమయంలో మథురకు చెందిన ఐఏఎస్ అధికారిని బి.చంద్రకళను మహేష్ ఖండెల్ వాల్ కలిశారు. ఆ సమయంలో మహిళల నెలసరి సమస్యల గురించి ఆమె ఆయనతో చర్చించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల దురవస్థ గురించి వివరించారు. ఈ సమస్య వారి ఆరోగ్యంతోను.. ఆర్థికాంశాలతోను ముడిపడి ఉన్నది కావడంతో.. వారికోసం ఏదైనా చేస్తే బాగుంటుందని చంద్రకళ సలహా ఇచ్చారు.
అలా ఆమె ఇచ్చిన సలహాను సీరియస్ గా తీసుకున్న మహేష్ ఖండెల్ వాల్.. అత్యంత చౌక ధరలో ఎకో ఫ్రెండ్లీ(పర్యావరణానికి హాని చేయని) 'డబ్ల్యూఈ' సానిటరీ నాప్కిన్స్ రూపొందించాడు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవి ఎకో ఫ్రెండ్లీ కావు:
మహిళల నెలసరి అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉత్పత్తులేవి ఎకో ఫ్రెండ్లీ కావు. ఇవి భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్ల సమయం పడుతుంది. ఆరోగ్య పరంగాను వీటి వాడకం మహిళలకు అంతమంచిది కాదని వైద్య నిపుణులు చెబుతారు. ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకుని భారతీయ మహిళల సమస్యలను తీర్చేందుకు దేశీ సానిటరీ నాప్కిన్స్ రూపకల్పన చేశాడు మహేష్.
అంత సులువుగా ఏమి జరగలేదు:
మహేష్ ఖండెల్ వాల్ ఆలోచన అంత సులువుగా కార్యరూపం దాల్చలేదు. తొలుత ఆయన సానిటరీ నాప్కిన్స్ ఉత్తత్తి చేయడానికి అవసరమైన సామాగ్రి సిద్దం చేసుకున్నారు. ఇందులో తయారీదారులుగా మహిళలనే నియమించుకున్నారు.
అయితే చాలామంది వివాహిత స్త్రీల భర్తలు.. తొలుత వారిని ఈ పనికి పంపించేందుకు అభ్యంతరం చెప్పారు. ఇలాంటి పనులు చేయడాన్ని వారు చిన్న చూపుతో చూశారు. కానీ మహేష్ ఖండెల్ వాల్ పట్టు విడవలేదు. ఎంతోమంది మహిళలను కలిసి, వారి సమస్య తీవ్రత గురించి వివరించి.. తమ ప్రయత్నం ఏవిధంగా ఉపయోగపడుతుందో క్షణ్ణంగా చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఆలోచన నచ్చిన చాలామంది మహిళలు అతనితో పాటు జతకలిశారు.
30కోట్ల మందికి అవసరం:
దేశంలో దాదాపు 30కోట్ల మంది మహిళలకు సానిటరీ నాప్కిన్స్ అవసరం. బహుళ జాతి కంపెనీలు ఈ మార్కెట్ ను కొల్లగొట్టాయి. అయితే ధర పరంగా అవి మధ్య తరగతి, ఉన్నతవర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదీగాక పర్యావరణ పరంగాను, ఆరోగ్యం పరంగాను వాటి వాడకం సరైంది కాదనే అభిప్రాయం ఉంది.
ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంత మహిళలను దృష్టిలో పెట్టుకుని అత్యంత చౌక ధరలో రూ.10కే 6సానిటరీ నాప్కిన్స్ తో కూడిన ప్యాడ్స్ ఇచ్చేలా ఉత్పత్తులు తయారుచేశాడు. మార్కెట్లో ఉన్న బహుళ జాతి కంపెనీల ఉత్పత్తుల్లో 1.5శాతం మేర పాలిమర్ ఉపయోగిస్తుంటే.. వీరి ఉత్పత్తుల్లో మాత్రం కేవలం 0.7శాతం పాలిమర్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.
పాలిమర్ ఎక్కువగా ఉపయోగించడం పర్యావరణానికి హానికరంగా మారుతుంది. ఇది భూమిలో కలిసిపోవాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది.
మహిళలు స్వశక్తిగా ఎదగడానికి:
మహేష్ ఖండెల్ వాల్ రూపొందించిన మెషీన్ ద్వారా ప్రస్తుతం చాలామంది మహిళలు ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. రూ.1లక్షకే ఈ మెషీన్ అందుబాటులో ఉండటం ద్వారా చాలామంది మహిళలు దీన్ని కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతీ రోజు కనీసం 2000సానిటరీ నాప్కిన్స్ తయారుచేసి మార్కెట్లో విక్రయించవచ్చు. ఈ మెషీన్ కు విద్యుత్ కూడా ఎక్కువ అవసరం లేదు. కేవలం రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే చాలు.. రోజంతా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని మహేష్ ఖండెల్ వాల్ రూపొందించారు.
రెడ్ క్రాస్ కుటీర్ చేయూత:
మహేష్ ఖండెల్ వాల్ రూపొందించిన మెషీన్స్ రెడ్ క్రాస్ కుటీర్ ఉత్పత్తి చేస్తోంది. చాలామంది మహిళలకు సానిటరీ నాప్కిన్స్ తయారీలో శిక్షణ కూడా ఇస్తోంది. ప్రస్తుతం వాత్సల్య గ్రామ్-మథుర(యూపీ), వడోదరా(గుజరాత్) బులంద్ షహర్(యూపీ) వంటి గ్రామాల్లో 'డబ్ల్యూఈ' టెక్నాలజీ ట్రెయినింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.