స్కెచ్ ఒకరేస్తే.. అమలు చేసింది మరొకరు: పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ ఎవరిది..?
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పాల్పడటంతో 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దాడి చేసింది అదిల్ అహ్మద్ దార్ అయినప్పటికీ దీని వెనక మరో వ్యక్తి హస్తముందనే వార్త బయటకు పొక్కింది. ఆ వ్యక్తే అదిల్కు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే జైషే మహ్మద్ సంస్థలో చేరిన ఈ వ్యక్తి అంత తొందరగా ఎలా రాటుదేలాడు..?
దాడుల వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఘాజీ రషీద్
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఘాజీ అబ్దుల్ రషీద్. గురువారం జరిగిన దాడుల వెనక రషీద్దే మాస్టర్ బ్రెయిన్ అని జమ్ము కశ్మీర్ ఇంటెలిజెన్స్ విభాగాలు చెబుతున్నాయి. రషీద్ జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థలో కమాండర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జైషే మహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడు రషీద్. ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో రషీద్ సిద్ద హస్తుడని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక గురువారం దాడులకు పాల్పడ్డ ఆత్మాహుతి సభ్యుడు అదిల్ అహ్మద్ దార్కు శిక్షణ ఇచ్చింది రషీదే అని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడు
గతేడాది డిసెంబరులో రషీద్ మరో ఇద్దరితో కలిసి కశ్మీర్లోకి చొరబడ్డాడు. మసూద్ అజార్ బంధువులను ఇద్దరిని భారత బలగాలు మట్టుబెట్టడంతో ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా రషీద్ను మసూద్ పురమాయించినట్లు తెలుస్తోంది. 2017లో మసూద్ అజర్ బంధువు తలాహ్ రషీద్, 2018లో ఉస్మాన్లను పుల్వామాలో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు అదే పుల్వామా జిల్లాలో 40 మంది జవాన్లను చంపి పగ చల్లార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
తాలిబన్ల కింద శిక్షణ పొంది..ఆపై జైషే మహ్మద్ ట్రైనర్గా
గురువారం జరిగిన దాడులకు కొద్ది రోజుల ముందు పుల్వామా జిల్లాలోని రత్నిపొరా గ్రామంలో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఘాజీ రషీద్ తృటిలో తప్పించుకున్నాడు. ఆ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ ఎన్కౌంటర్లో మరో ఆర్మీ జవాను బల్జీత్ అమరుడయ్యాడు. ఘాజీ రషీద్ అనే ఈ జైషే ఉగ్రవాది 2008లో ఆ సంస్థలో చేరాడు. అఫ్గానిస్తాన్లోని తాలిబన్ల కింద ఈ వ్యక్తి శిక్షణ పొందాడు. 2010లో పాకిస్తాన్ ఉత్తర వాజిరిస్తాన్ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్కు వచ్చి జైషే మహ్మద్లో ఉగ్రవాదులకు ట్రెయినర్గా ఉన్నాడు. జైషే మహ్మద్ సంస్థ ఎలాంటి ఆపరేషన్స్ లేదా దాడులు నిర్వహించిన దక్షిణ కశ్మీర్ నుంచే ఘాజీ కమాండ్లు ఇస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే జైషేమహ్మద్ కాలక్రమంలో బలోపేతం అయ్యింది. కశ్మీర్లోని స్థానిక యువకులను కూడా నియమించుకోవడం ప్రారంభించింది. భద్రతాబలగాలు ఘాజీ రషీద్ కోసం విపరీతంగా గాలిస్తున్నాయి.