'రాఫెల్' మొనగాళ్లు... ఆ 5 యుద్ద విమానాలను భారత్ చేర్చిన పైలట్లు వీళ్లే...
రాఫెల్.. రాఫెల్... గత 24గంటలుగా దేశంలో దీని గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రాఫెల్ రాకతో భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాఫెల్ యుద్ద విమానాలతో భారత వైమానిక దళంలో కొత్త శకానికి నాంది పలికినట్లయిందని.. ఈ మల్టీరోల్ విమానాలు ఐఏఎఫ్ సామర్థ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మొదటి విడత రాఫెల్ విమానాలను భారత్కి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఏడుగురు పైలట్ల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్లు లేకుండా రాఫెల్ భారత గడ్డపై అడుగుపెట్టేది కాదనడంలో అతిశయోక్తి లేదు.
Recommended Video
గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్...
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలను తీసుకొచ్చిన పైలట్ల బృందానికి గోల్డెన్ ఆరో 17 స్క్వాడ్రన్ రాఫెల్ కమాండింగ్ ఆఫీసర్ హర్కీరత్ నేత్రుత్వం వహించారు. హర్కీరత్ సింగ్కు గతంలో అత్యంత ప్రతిష్టాత్మక శౌర్య చక్ర అవార్డు లభించింది. 2008లో ఓ మిషన్ సందర్భంగా హర్కీరత్ MiG 21 బైసన్ ఎయిర్క్రాఫ్ట్ను నడిపారు. అయితే విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైనప్పటికీ... అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అది కూలిపోకుండా ల్యాండ్ చేయగలిగాడు. దాంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడినవాడయ్యాడు. ఆ సమయంలో ఆయన స్క్వాడ్రన్ లీడర్గా ఉన్నారు. హర్కీరత్ తండ్రి కూడా ఆర్మీలోనే లెఫ్టినెంట్ కల్నల్గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు. హర్కీరత్ భార్య కూడా ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్లో సర్వింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.
వింగ్ కమాండర్ అభిషేక్ త్రిపాఠి
జనవరి 9,1984న జన్మించిన త్రిపాఠి స్కూల్ రోజుల్లో రెజ్లర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజస్తాన్లోని జలౌర్ అనే చిన్న పట్టణం నుంచి ఎదిగొచ్చాడు. ఆయన తండ్రి బ్యాంకు ఉద్యోగి కాగా తల్లి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. యువకుడిగా ఉన్నప్పుడు మంచి క్రీడాకారుడిగా కూడా త్రిపాఠి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలను భారత్ తీసుకొచ్చిన పైలట్లలో త్రిపాఠి కూడా ఒకరు.
వింగ్ కమాండర్ మనీష్ సింగ్..
ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలోని బక్వా అనే ఓ మారుమూల గ్రామం నుంచి మనీష్ సింగ్ ఎదిగొచ్చాడు. ఆయన కుటుంబంలో చాలామంది ఆర్మీలో పనిచేశారు. అదే పరంపరను కొనసాగిస్తూ మనీష్ సింగ్ కూడా సైనిక్ స్కూల్లో చదువుకుని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. 2003లో ఎయిర్ఫోర్స్లో చేరి సేవలందిస్తున్నారు. ఫ్రాన్స్లో రాఫెల్ యుద్ద విమానాల శిక్షణకు ఎంపిక చేసిన 12 మంది పైలట్లలో మనీష్ కూడా ఒకరు. రాఫెల్ యుద్ద విమానాలను మనీష్ నడపడం గర్వంగా ఉందని ఆయన తల్లి పేర్కొన్నారు.
గ్రూప్ కెప్టెన్ రోహిత్ కటారియా..
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ద విమానాలను భారత్కి తీసుకొచ్చిన పైలట్లలో రోహిత్ కటారియా ఒకరు. హర్యానాలోని బసాయ్ అనే చిన్న గ్రామం నుంచి రోహిత్ వచ్చారు. ఆయన తండ్రి కూడా ఆర్మీలో పనిచేసి కల్నల్గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత సైనిక్ స్కూల్కి ప్రిన్సిపాల్ అయ్యారు. రోహిత్ కటారియా రాఫెల్ యుద్ద విమానం నడుపుతున్నాడని తెలిసి ఆయన స్వగ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ తమకు రోల్ మోడల్ అని అభిప్రాయపడ్డారు. ఈ నలుగురే కాదు,రాఫెల్ యుద్ద విమానాలను భారత్కు తీసుకొచ్చిన మరో ముగ్గురు పైలట్లపై కూడా దేశవ్యాప్తంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.