రామ మందిర నిర్మాణ తేదీని ఖరారు చేస్తారా.. నేడే ట్రస్టు తొలి సమావేశం..
Recommended Video
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన 'శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ' నేడు తొలిసారిగా సమావేశం కానుంది. రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించే తేదీపై ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ సభ్యుల ఎంపికలో భాగంగా హిందువులైన ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ట్రస్టు సభ్యులు నామినేట్ చేసే అవకాశం ఉంది. రామ్ మందిర్ న్యాస్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ను ట్రస్ట్లో చేర్చడంపై కూడా చర్చించనున్నట్లు స్వామి వాసుదేవానంద్ సరస్వతి గత వారం వెల్లడించారు.
ఎప్పటినుంచి ప్రారంభిస్తారు..
రామ మందిర నిర్మాణాన్ని రామ నవమి లేదా ఏప్రిల్లో వచ్చే అక్షయ తృతీయ నుంచి చేపడుతామని ట్రస్టు సభ్యుల్లో ఒకరైన స్వామి గోవింద్ దేవగిరి మహరాజ్ గతంలో తెలిపారు. అయితే నిర్మాణానికి సంబంధించి పలు సాధ్యాసాధ్యాలు,అనేక అంశాలు,పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే మొదలుపెడుతామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ట్రస్టు శాశ్వత కార్యాలయం..
ట్రస్టుకు శాశ్వత కార్యాలయంగా ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతం, ఆర్-20 భవంతిని కేటాయించనున్నారు. ఈ భవంతి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ట్రస్ట్ చైర్మన్, అయోధ్య కేసులో రామ్లలా, హిందూ పక్షాల తరఫున వాదించిన పరాశరన్ నివాసమే కావడం గమనార్హం. రామ మందిర నిర్మాణ ట్రస్టులో మొత్తం 15 మంది సభ్యులు ఉండనుండగా.. తొమ్మిది మంది శాశ్వత, ఆరుగురు తాత్కాలిక సభ్యులు ఉండనున్నారు. శాశ్వత సభ్యులుగా చైర్మన్ పరాశరన్ తోపాటు వాసుదేవానంత్, మాధవాచార్య స్వామి,యుగపురుష్ పరమానంద్, స్వామీ గోవిందదేవ్, విమలేందు మోహన్ ప్రతా ప్ మిశ్రా, డాక్టర్ అనిల్మిశ్రా, పట్నాకు చెందిన కమలేశ్వర్ చౌపాల్, నిర్మోహీ అఖాడా చీఫ్ మహంత్ ధీరేంద్ర దాస్ ఉండనున్నారు. తాత్కాలిక సభ్యులు ఆరుగురిని నేటి భేటీలో ఎంపిక చేసే అవకాశం ఉంది.
ట్రస్టుకు పూర్తి స్వేచ్చ..
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబందించిన ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే పూర్తి స్వేచ్ఛ శ్రీరామ జన్మభూమి ట్రస్టుకు ఉంటుందని, విరాళాల సేకరణ, పెట్టుబడులు లాంటి వ్యవహారాలూ అదే చూసుకుంటుందని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయోధ్య టెంపుల్ ట్రస్టు ఆర్థిక లావాదేవీలను పక్కాగా నిర్వహించాలని, నిర్ణీత కాల వ్యవధిలో ట్రస్టు ఖాతాలను ఆడిట్ చేస్తామనీ ప్రభుత్వం తెలిపింది.
గతేడాది తీర్పు వెలువరించిన సుప్రీం..
దశాబ్దాలుగా వివాదాస్పద స్థలంగా కొనసాగిన అయోధ్య-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు గతేడాది నవంబర్ 9న తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్కు అప్పగించిన కోర్టు.. మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ఆదేశించింది.