నవ భారతం కోసం కలిసిరండి: ప్రజలకు మోదీ పిలుపు
నవభారతం నిర్మాణం కోసం తనతో కలిసి రావాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జనాభాలో అధికశాతం యువత ఉన్న నేపథ్యంలో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలు నవ భారత నిర్మాణానికి నాందిగానే .
న్యూఢిల్లీ: నవభారతం నిర్మాణం కోసం తనతో కలిసి రావాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జనాభాలో అధికశాతం యువత ఉన్న నేపథ్యంలో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలు నవ భారత నిర్మాణానికి నాందిగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. 2022లో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకొనేనాటికి జాతిపిత గాంధీజీ, ఉక్కు మనిషి సర్దార్ పటేల్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గర్వపడే భారతాన్ని సాధించుకోవాలన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘన విజయం, మణిపూర్, గోవాలలో పోటాపోటీ విజయాలు సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లోనూ గెలిచేది తామేనని పరోక్ష విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రగతికి ప్రతీకగా నిలిచే అవినీతిరహిత భారత్ నిర్మాణానికి ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఎన్నికల ఫలితాలను.. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ ఫలితాలను తాను నవ భారతానికి నాందిగా చూస్తున్నానని అన్నారు.
నేను ఈ విజయాన్ని నవభారతానికి నాందిగా పరిగణిస్తున్నాను. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపువారు.. జాగరూకులైన మహిళలు ఉండడటం సంతోషకరమని పేర్కొన్నారు. నవభారతంలో పేదలు తమ భవితవ్యాన్ని తాము నిర్దేశించుకునే అవకాశాలను కోరతారే తప్పఇతరుల దాతృత్వాన్ని ఆశించరని, ఈ మార్పును తాను చూస్తున్నాను అని ఆయన అన్నారు.
ఐక్యతకు ప్రధాని పిలుపు ఇలా..
2022 నాటికి ప్రధాని మోదీ లక్ష్యాలు నిర్దేశించారు. వినూత్న ఆవిష్కరణలు, కఠోరశ్రమ, సృజనాత్మకతలతో భారత్ ముందుకెళుతున్నదని, శాంతి, ఐక్యత, సహోదర భావంతో కొనసాగుతున్నదని, అవినీతి, ఉగ్రవాదం, అక్రమధనం నుంచి విముక్తమవుతున్నదన్నారు.
అవినీతి రహితంపై ప్రధాని ఇలా..
అవినీతిరహిత భారత్ కోసం నిలబడతామని, నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తామని, స్వచ్ఛభారత్, మాదకద్రవ్యరహిత కోసం కృషిచేస్తామని ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. మహిళా నేతృత్వ ప్రగతిని ప్రోత్సహిస్తామని, సులభప్రవేశ భారత్కు మద్దతునిస్తామని, శాంతిసామరస్య ఏకత్వ భారత్ కోసం కృషి చేస్తామని, ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి సృష్టికర్తలుగా రూపొందుతామని ప్రతిజ్ఞ చేయాలన్నారు.
హర్ హర్ మోదీ నినాదాలతో మిన్నంటిన హస్తిన
ప్రధాని మోదీ మోటారు వాహనాల శ్రేణితో బీజేపీ జాతీయ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి కొద్ది దూరంలో కారు దిగి పార్టీ కార్యకర్తలు, అభిమానులకు చేతులూపుతూ అభివాదం చేశారు. వారంతా మోదీ, మోదీ.. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని నినదిస్తూ ఆయనను ప్రశంసలు, పూలజల్లులతో ముంచెత్తారు. అంతకుముందు ఆయన నవభారతాన్ని నిర్మించేందుకు దేశప్రజలు ప్రతిజ్ఞ తీసుకోవాలని ట్వీట్ చేశారు. తన వెబ్సైట్ ‘నరేంద్రమోదీ డాట్ ఇన్'లో ఒక పోస్టు చేశారు. ‘నవభారతం నిర్మాణమవుతున్నది. 125 కోట్ల మంది భారతీయుల బలం, నైపుణ్యాలతో అది శక్తిమంతమవుతున్నది. ఈ భారతం ప్రగతికి ప్రతీకగా నిలుస్తుంది' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు నవభారతాన్ని నిర్మించే నిబద్ధతను చాటుతూ పలు అంశాలపై తన మొబైల్ యాప్లో ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
రాష్ట్రపతి ఎంపిక ఇలా
ఎప్పటి నుంచో రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా నిలబెట్టి, గెలిపించుకోవాలన్న బీజేపీ కల ఇప్పుడు నెరవేరనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో గెలుపుతో మోదీ ప్రతిపాదించిన వ్యక్తి రాష్ట్రపతి కానున్నారు. ఈ ఏడాది జూలైలో ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్నారు. జూన్లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, దేశంలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. వీరిలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు. ఇక, ఎమ్మెల్యే ఓటు విలువ ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తిని బట్టి ఉంటుంది. గరిష్ఠంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కనిష్ఠంగా 8. ఇక, ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే ఓటు విలువ 64; పంజాబ్ 116; గోవా 20; మణిపూర్ ఎమ్మెల్యే ఓటు విలువ 18. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10.98 లక్షల ఓట్లు ఉన్నాయి.
ఇలా బీజేపీ ఆధిక్యం..
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన మేజిక్ మార్కు 5.49 లక్షల ఓట్లు. అలాగే, ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓటర్లు 4896. వీరిలో ఎమ్మెల్యేలు 4120 కాగా ఎంపీలు 776. బీజేపీకి ఇప్పటికే 282 లోక్సభ; 56 రాజ్యసభ ఎంపీలు; 1126 మంది ఎమ్మెల్యేలు (ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు) ఉన్నారు. రాష్ట్రపతిని సొంతంగా గెలిపించుకోవడానికి ఎన్డీయేకి ఇంకా 75,076 ఓట్లు కావాలి. కానీ, ఎలక్టోరల్ కాలేజీలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఓట్లు 1,03,756. తాజా ఫలితాలతో ఒక్క యూపీ నుంచే ఎన్డీయేకు 67,600 ఓట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్ నుంచి 3648 ఓట్లు వచ్చాయి. ఇక, పంజాబ్, గోవా, మణిపూర్ల్లో బీజేపీకి వచ్చిన సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరినీ బతిమలాడకుండానే ఎన్డీయే తన అభ్యర్థిని రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టగలదు.