గోవా దెబ్బే రిపీట్: మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా?, కాంగ్రెస్కు భంగపాటు
షిల్లాంగ్: కాంగ్రెస్ మరోసారి బీజేపీ పన్నిన వ్యూహంలో చిత్తయిపోయింది. గతంలో గోవా మాదిరే.. ఈసారి మేఘాలయలోనూ ఆ పార్టీకి భంగపాటు తప్పలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం విఫలమైంది.
కాంగ్రెస్ కంటే ముందే చకచకా పావులు కదిపిన బీజేపీ.. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ 19సీట్లు)కు ఇతర పార్టీల మద్దతు కూడగట్టింది. సింగిల్ డిజిట్ స్థానాలను దక్కించుకున్న యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), హెచ్ఎస్ పీడీపీ, పీడీఎఫ్లను ఏకం చేసి ఎన్పీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించింది.
బీజేపీ ప్రయత్నాలతో ఎన్పీపీ బలం 34కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం సమకూరడంతో.. నేషనల్ పీపుల్స్ పార్టీ నేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాన్రాడ్ సంగ్మాను గవర్నర్ గంగా ప్రసాద్ ఆహ్వానించారు.
మంగళవారం సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ను కలిసిన సంగ్మా తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందించారు.