రాజ్భవనే అమ్మాయిల క్లబ్: రాసలీల గవర్నర్ రాజీనామా
మేఘాలయ గవర్నర్ వి షణ్ముగనాథన్(67) గురువారం రాత్రి రాజీనామా చేశారు.
షిల్లాంగ్: రాజ్భవన్ను లేడీస్ క్లబ్గా మార్చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ గవర్నర్ వి షణ్ముగనాథన్(67) గురువారం రాత్రి రాజీనామా చేశారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం పలువురు మహిళలు ఎప్పుడంటే అప్పుడు రాజ్భవన్కు వచ్చి వెళ్తున్నారని, వారిలో చాలా మంది ఏకంగా ఆయన పడకగది వరకు వెళ్తున్నారని, గవర్నర్ పదవి ప్రతిష్ఠకు షణ్ముగనాథన్ భంగం కలిగిస్తున్నారని, ఆయన్ను తక్షణం తొలగించాలంటూ.. రాజ్భవన్ సిబ్బంది డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గవర్నర్ పదవికి షణ్ముగనాథన్ రాజీనామా చేశారు. షణ్ముగనాథన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోడీకి షిల్లాంగ్లోని రాజ్భవన్ ఉద్యోగులు, సిబ్బంది 98 మంది తమ సంతకాలతో లేఖలు రాశారు. ప్రతులను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాకు కూడా పంపించారు.
షణ్ముగనాథన్ తన వద్ద విధులు నిర్వహించేందుకు యువతులనే ఎంచుకుంటున్నారని వారు లేఖలో ఆరోపించారు. ఇద్దరు ప్రజా సంబంధాల అధికారులను(పీఆర్వోలను), వంట మనిషిని, రాత్రివేళ విధులు నిర్వహించేందుకు ఒక నర్సును ఆయన నియమించుకున్నారని, వారంతా మహిళలేనని చెప్పారు.
గతంలో రాజ్భవన్లో ఒక ఉద్యోగం కోసం మౌఖిక పరీక్షను ఎదుర్కొనేందుకు వచ్చిన ఒక మహిళతోనూ షణ్ముగనాథన్ అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. 2015 మేలో మేఘాలయ గవర్నర్గా షణ్ముగనాథన్ బాధ్యతలు చేపట్టారు. నిరుడు నవంబరు నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. గురువారం అరుణాచల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొన్నారు. కాగా, ఉద్యోగులు ప్రధానికి లేఖ రాసిన విషయం నిజమే కానీ, వివరాలు తెలియవని గవర్నర్ కార్యదర్శి లకియాంగ్ చెప్పారు.