15 నుంచి ఆ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేత: రవాణా సహా అన్నీ ఓపెన్: విద్యాసంస్థలు మినహా
షిల్లాంగ్: కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ముగియడానికి కౌంట్డౌన్ ఆరంభమైంది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో లాక్డౌన్ ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి లాక్డౌన్ను కొనసాగించాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్చ మరింత రసవత్తరంగా సాగుతోంది.
మాస్కుల చుట్టూ ఏపీ పాటిలిక్స్: మాస్కులు కూడా లేవ్: డాక్టర్ సుధాకర్ అటాక్: వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రం..
అదే సమయంలో తాము 15వ తేదీన లాక్డౌన్ను ఎత్తేయబోతున్నట్లు ప్రకటించింది మేఘాలయా. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. పాఠశాలలు, విద్యాసంస్థలు మినహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటూనే.. జనజీవనాన్ని పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. లాక్డౌన్ను ఎత్తేస్తామని అధికారికంగా ప్రకటించిన తొలి రాష్ట్రం అదే.
కేబినెట్లో నిర్ణయం..
లాక్డౌన్ కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై మంగళవారం ఉదయం మేఘాలయా ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పలు అంశాలు ఈ సందర్భంగా మంత్రివర్గ సభ్యుల సమక్షానికి వచ్చాయి. లాక్డౌన్ను మరి కొంతకాలం పాటు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఇబ్బందులు ఏర్పడతాయని మెజారిటీ మంత్రులు అభిప్రాయ పడ్డారు. ఇప్పటికే పర్యాటక రంగం పూర్తిగా స్తంభించిపోవడం వల్ల ఖజానాకు ఆదాయం తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగించాల్సి ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని మంత్రులు వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణ..
దీనితో లాక్డౌన్ను ఎత్తేయడమే మంచిదని, వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన నిబంధనలు, మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంటుందని మంత్రులు సూచించారు. దీనితో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడం వైపే మొగ్గు చూపింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని మేఘాలయా ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సాంగ్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
రవాణా, మార్కెట్లు..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వ్యవస్థ 15వ తేదీ నుంచి పునరుద్ధరిస్తామని, మార్కెట్లను తెరుస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవు కొనసాగుతుందని, అనంతరం వాటిని కూడా తెరుస్తామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా ముందు జాగ్రత్తలను తీసుకుంటామని అన్నారు.