భీకర ఎన్కౌంటర్! మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, భద్రతాబలగాలకు భారీ విజయం
గౌహతి: మరో మూడు రోజుల్లో మేఘాలయలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశ భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. శనివారం భీకర ఎన్కౌంటర్లో నిషేధిత గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ(జీఎన్ఎల్ఏ) చీఫ్, మేఘాలయ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హతమయ్యాడు. ఈస్ట్ గరో హిల్స్ జిల్లాలోని దోబు సమీపంలో ఉన్న అచక్పెక్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
గరో హిల్స్ జిల్లాలో ఈనెల 19న చోటుచేసుకున్న ఐఈడీ దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జేఎన్ సంగ్మా, మరో ముగ్గురు మరణించడంతో మిలిటెంట్ల ఏరివేత చర్యలు ముమ్మరమయ్యాయి. ఇది జీఎన్ఎల్ఏ పనిగానే అనుమానిస్తున్న ఉగ్రవాద నిరోధక బలగాలు పెద్దఎత్తున జరిపిన గాలింపుల్లో తాజా ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఆ ఆపరేషన్లో పాల్గొన్న సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రజలను భయపెట్టేందుకే తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రత్యేక భద్రతా బలగాలను రంగంలోకి దించారు.
2009లో ఏర్పడిన జీఎన్ఎల్ఏ గారో ల్యాండ్ సౌరభౌమాధికారం కోసం పోరాడుతుంది. గారో హిల్స్లో సోహన్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. గారోహిల్స్ పోలీసు, మేఘాలయ స్పెషల్ ఫోర్స్-10 కమాండోస్ సంయుక్తంగా శనివారం జరిపిన ఎన్కౌంటర్లో సోహన్ మృతిచెందాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది.