కథువా రేప్.. న్యాయాన్ని అడ్డుకోలేరు, రేప్ చేస్తే ఉరిశిక్ష చట్టం తెస్తాం: మెహబూబా ముఫ్తీ
కాశ్మీర్: కథువా అత్యాచారం కేసులో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని, మైనర్ల పైన అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించే విధంగా చట్టాన్ని తీసుకు వస్తామని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం వెల్లడించారు.
కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత జనవరిలో బాలికను అపహరించిన ఆరుగురు దుండగులు ఓ చిన్న గ్రామంలో వారం రోజులపాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకి రాళ్లతో కొట్టి చంపే ముందు మరోసారి ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశారు.
చదవండి: కథువా రేప్: ప్రధాని నిందితుడితోపాటు 8మందిపై ఛార్జీషీటు, అత్యంత పాశవికం
ఈ అంశంపై ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేశామని, న్యాయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆమె తెలిపారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కొంతమంది బాధ్యత లేని పనులు, మాటల వల్ల న్యాయాన్ని అడ్డుకోలేరన్నారు.
ఈ కేసులో నిందితులకు తీవ్రమైన శిక్ష ఉంటుందన్నారు. మరో బాలిక ఇలాంటి ఘాతుకానికి బలికాకుండా చూస్తామని ముఫ్తీ పేర్కొన్నారు. చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే మరణ శిక్ష విధించే చట్టం తెస్తామన్నారు.
కథువా ప్రాంతంలో వెనుకబడిన బఖ్రేవాల్ వర్గానికి చెందిన 8ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసిన ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
చదవండి: ఎమ్మెల్యే రేప్పై ఆధారాల్లేవు: యూపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ జోక్యం.. సీబీఐకి అప్పగింత
బాలికకు మత్తు పదార్థాలు ఎక్కించి పలువురు వ్యక్తులు మూడు రోజుల పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జనవరి 17న బాలికను హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేశారు. హంతకులు ఆమె తలపై రెండు సార్లు రాయితో కొట్టినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. బాలిక మరణంతో కతువా ప్రాంతంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. వీరిలో ఒక జువైనల్ కూడా ఉన్నాడు.
నిరవధిక నిరాహార దీక్ష
కథువా ఘటనలో నిందితులకు శిక్ష పడేవరకు నిరవధిక నిరాహార దీక్ష చేపడతానంటూ ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ వెల్లడించారు. శుక్రవారం నుంచి ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ సంఘటనలపై ఆమె ప్రధాని మోడీకి లేఖ రాశారు. మైనర్ల మీద అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఆరు నెలల్లోపు మరణశిక్ష విధించాలని రెండున్నర సంవత్సరాల్లో అనేక సార్లు అభ్యర్థించామని, దానికి మద్దతుగా 5.5లక్షల లేఖలను మీకు పంపించామని అందులో పేర్కొన్నారు.
అయితే ఇంతవరకు ప్రధాని మోడీ దీనిపై స్పందించలేదన్నారు. ఉన్నావ్, కథువా ఘటనలను ఉద్దేశిస్తూ.. మీరు ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి ఒకరోజు దీక్ష చేపట్టారని, మహిళలకు సంరక్షణ లేకుండా ప్రజాస్వామ్యం ఎలా బలోపేతం అవుతుందని ప్రశ్నించారు.