హౌస్ అరెస్ట్ టు గెస్ట్ హౌస్.. మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్ట్
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నేతలందరినీ గృహ నిర్భందంలోకి తీసుకొని కశ్మీర్లో పరిస్థితిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు సమీక్షిస్తున్నారు.
370 ఆర్టికల్ రద్దుతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారేమోననే అంచనాతో మెహబుబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారిని గెస్ట్ హౌస్ను తరలించినట్టు సమాచారం. దీనిని పోలీసు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. 370 ఆర్టికల్పై చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని కేంద్రం చెప్తున్నది. దీనిని మెమబూబా మాత్రం త్పపుపట్టారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని కామెంట్ చేశారు. మరోవైపు ఆదివరం నుంచే శ్రీనగర్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బలగాలను మొహరించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వచ్చారు.
ఇవాళ ఉదయం కేంద్ర క్యాబినెట్ కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాష్ట్రపతి కోవింద్ కూడా ఆమోదం తెలిపారు. తర్వాత గెజిట్ కూడా విడుదలైంది. తర్వాత ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. నాలుగు బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్పై ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 35 వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మరో 8 వేల మంది జవాన్లను పంపించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అన్నిరాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, పోలీసు కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. శాంతి భద్రతలను కాపాడేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. హై అలర్ట్ జారీచేసి .. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. జమ్ము, కశ్మీర్ ప్రజల భద్రత, విద్యార్థులకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలని సూచించింది.