ఇదెక్కడి రాజ్యం.. కేంద్రంపై భగ్గుమన్న ముఫ్తీ: ఒమర్ ఘాటు వ్యాఖ్యలు
శ్రీనగర్: తనను తన కూతురు ఇల్తీజాలను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించినట్లు పేర్కొన్నారు పీడీపీ అధినేత్రి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. తమ పార్టీ నేత వహీద్ ఉర్ రెహ్మాన్ పర్రాను అరెస్టు చేశారని, తనను పరామర్శించేందుకు తన నివాసంకు వెళుతుండగా నిర్బంధించినట్లు తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. వ్యక్తిగత స్వేచ్ఛను కేంద్రంలోని బీజేపీ సర్కార్ హరిస్తోందంటూ మండిపడ్డారు. ఓసారి వదలడం మరోసారి అరెస్టు చేయడం అంతా ప్రభుత్వం ఇష్టానికే జరుగుతోందని మండిపడ్డారు. అసలు జమ్మూ కశ్మీర్లో స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు.
తనను రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్ పాలకులు నిర్బంధించారని మెహబూబా ముఫ్తీ ఉర్దూలో ఇంగ్లీషులో ట్వీట్ చేశారు. బీజేపీ మంత్రులు, వారి కార్యకర్తలు కశ్మీర్లో ప్రతి మూల స్వేచ్ఛగా తిరుగుతున్నారని తాము వెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం అన్యాయంగా నిర్భంధిస్తున్నారని ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వరకు వస్తే మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే మాటను మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. వహీద్ను అన్యాయంగా అరెస్టు చేశారని తన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళితే తనను నిర్బంధించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు ముఫ్తీ.
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థల నుంచి సహాయం కోరిన ఆరోపణలపై వహీద్ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సహకరించాల్సిందిగా వహీద్ కోరినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఆ ఎన్నికల్లో ముఫ్తీ పోటీ చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం వహీద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే తన షెడ్యూల్ను మార్చుకోవాల్సిందిగా అడిషనల్ డీజీపీ మరియు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఎస్డీ సింగ్ కోరినట్లు ముఫ్తీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ముఫ్తీ ప్రయాణించే మార్గంను చెక్ చేయాల్సి ఉండగా అది జరగలేదని అందుకే పర్యటనను రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా పోలీసులు కోరారు. మరోవైపు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల విధులకు పోలీసులు హాజరుకావడంతో సరైన భద్రత కల్పించలేమని చెప్పారు. నవంబర్ 28వ తేదీ నుంచి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జమ్మూ కశ్మీర్లో వ్యక్తిగత స్వేఛ్ఛకు భంగం కలిగేలా పోలీసులు ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు ఒమర్ అబ్దుల్లా. ఉదయం లేవగానే తమ ఇంటి గేట్ ముందు పోలీసుల ట్రక్ ఉంటుందని అది వారికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ అయిపోయిందని మండిపడ్డారు. తన తండ్రి ప్రార్థనలు చేసేందుకు కూడా వీలు లేకుండా చేశారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.