గద్దెనెక్కిన ముఫ్తీ: తొలి మహిళా సీఎంగా రికార్డు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్కు 13వ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె అయిన మెహబూబా (56) ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా, దేశంలో తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్ సింగ్ ప్రమాణం చేశారు. రాజ్ భవన్లో సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ వోహ్రా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలైన ఆమె 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ముఫ్తీతో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణంతో ప్రభుత్వాని ఏర్పాటు చేశారు. ముఫ్తీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రులు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కౌర్ బాదల్, జయంత్ సిన్హాతో పాటు బీజేపీ నేత రాంమాధవ్ తదితరులు హాజరయ్యారు.
వీరితో పాటు ఈ కార్యక్రమానికి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్ధుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్ధుల్లా హాజరయ్యారు. కాగా, ముఫ్తీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బాయ్ కాట్ చేసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మిర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆరెస్సెస్ మద్దతు ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా తాము వ్యతిరేకిస్తామని, మూడు నెలల పాటు రాష్ట్రంలో ప్రభుత్వం లేకుండా ముఫ్తీ మెహబూబా జాప్యం చేసినందుకు గానూ తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. 87 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలవగా... నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) 15, కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను గెలుచుకుంది.