నన్ను నిర్బంధించారు.. తాత సమాధి వద్దకు వెళ్లడం నేరమా? : మెహబూబా ముఫ్తీ కుమార్తె
జమ్మూకాశ్మీర్ పోలీసులు తనను గృహ నిర్భంధం చేశారని మాజీ కశ్మీర్ ముఖ్యమంత్రి,పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తనయ ఇల్తిజా ముఫ్తీ ఆరోపించారు. దివంగత కశ్మీర్ ముఖ్యమంత్రి,తమ తాత ముఫ్తీ మహమ్మద్ సయీద్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులు అర్పించాలనుకున్నానని,కానీ అధికారులు అందుకు అనుమతించలేదని తెలిపారు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహరా ప్రాంతంలో ఉన్న తన తాత సమాధి వద్దకు వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించినట్టు చెప్పారు. ప్రస్తుతం తనను ఇంట్లోనే నిర్బంధించారని,ఎక్కడికి కదలనివ్వట్లేదని వాపోయారు. ఒక మనవరాలిగా తన తాత సమాధిని సందర్శించడం నేరమవుతుందా అని ప్రశ్నించారు. నిరసనకారులతో చేరి తాను కూడా రాళ్లు రువ్వుతానని భయపడుతున్నారా అని నిలదీశారు.
ఇల్తీజా ముఫ్తీ ఆరోపణలను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మునీర్ ఖాన్ ఖండించారు. ఆమెను గృహ నిర్బంధం చేయలేదని చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని ముఫ్తీ మహమ్మద్ సయీద్ సమాధిని సందర్శించేందుకు స్థానిక అడ్మినిస్ట్రేషన్ అనుమతివ్వలేదని తెలిపారు. ఇల్తీజా ప్రస్తుతం ఎఎస్జీ భద్రత నడుమ ఉందన్న విషయం కూడా గుర్తుంచుకోవాలని, ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు.
కాగా,జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత శ్రీనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిర్బంధించిన ఐదుగురు నేతలకు త్వరలోనే విముక్తి కల్పిస్తారని తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలకు మాత్రం ఇప్పట్లో గృహ నిర్బంధం నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు.