పాక్ హైకమిషన్ కు వార్నింగ్: భారత్ నుంచి వెళ్లిపోండి !
న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖకు చెందిన కీలక ప్రతాలు చోరీ చేశాడని ఆరోపణలపై అరెస్టు అయిన పాక్ హై కమిషన్ అధికారి మహమ్మద్ అక్తర్ ను ఢిల్లీ పోలీసు అధికారులు విచారించి వివరాలు సేకరించారు.
తరువాత మహమ్మద్ అక్తర్ ను ముందుగా భారత్-పాక్ చేసుకున్న ఒప్పందం మేరకు భారత్ అధికారులు అతన్ని వదిలి పెట్టారు. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లి పోవాలని పాక్ అధికారి మహమ్మద్ అక్తర్ కు ఆదేశాలు జారీ చేశారు.
అయితే గూఢచర్యం చేస్తున్నారని మహమ్మద్ అక్తర్ మీద ఆరోపణలు రావడంతో ఆయన్ని దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. పాక్ ఐఎస్ఐకి గూఢచారులుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ సుభాష్ జహంగీర్, మౌలానా రెహమాన్ అనే ఇద్దరిని రాజస్థాన్ లో బీఎస్ఎఫ్ బలగాలు ఇప్పటికే అరెస్టు చేశాయి.
వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు భారత ఇంటిలిజెన్స్ అధికారులు పాక్ హై కమిషన్ ఉద్యోగుల మీద నిఘా వేశారు. పాక్ అధికారుల మీద నిఘా వేయ్యాలని రాజస్థాన్, ఢిల్లీ పోలీసులకు భారత ఇంటిలిజెన్స్ అధికారులు సూచించారు.
పాక్ హై కమిషనర్ బసిత్ కు ఇప్పటికే సమన్లు జారీ చేశారు. విదేశాంగ అధికారులు ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పాక్ హై కమిషన్ ఉద్యోగి మహమ్మద్ అక్తర్ అరెస్టు కావడంతో పాక్ ఎలా స్పంధిస్తుందో ? వేచి చూడాలి.