జమ్మూ కాశ్మీర్ కు యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందం: అసలు కథేంటీ?
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి మంగళవారం వారు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించనున్నారు. ఈ పర్యటన కోసం యూరోపియన్ దేశాల పార్లమెంట్ సభ్యుల బృందం సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంది. బృందం సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధానమంత్రి అధికారిక నివాసంలో వారు మోడీని కలుసుకున్నారు. ఇప్పటిదాకా బీజేపీ, ఎన్డీయేతర రాజకీయ పార్టీల నాయకులను జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్డుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులు మొన్నటి దాకా కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. వారిని కలుసుకోవడానికి సొంత పార్టీ నాయకులకు కూడా అనుమతించలేదు. కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే వెసలుబాటును కల్పించలేదు కేంద్రం.
జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్ స్థాయి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే ఆయా నాయకులపై విధించిన ఆంక్షలను సడలించింది. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఏకంగా యూరోపియన్ దేశాల పార్లమెంట్ సభ్యులే జమ్మూ కాశ్మీర్ ను సందర్శించడానికి భారత్ కు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం వారు అజిత్ దోవల్ తో కలిసి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఉరుము లేని పిడుగులాగా ఇంత హఠాత్తుగా ఏకంగా 28 మంది యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు దేశ రాజధానిలో దిగడం విస్మయానికి గురి చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఈ పార్లమెంటేరియన్ల బృందం జమ్మూ కాశ్మీర్ ను సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు ఏవీ చేసినట్లుగా కనిపించలేదని అంటున్నారు. దీనికి అజిత్ దోవల్ కారణమై ఉండొచ్చని, ఆయన ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు మాత్రమే ఈ సమాచారాన్ని చేరవేసి ఉంటారని చెబుతున్నారు. పార్లమెంటేరియన్ల బృందాన్ని జమ్మూ కాశ్మీర్ లో పర్యటింపజేయడంలో.. కేంద్ర ప్రభుత్వం వ్యూహమేనని, ఈ పర్యటన వల్ల అక్కడంతా సజావుగా ఉందనే సంకేతాన్ని ప్రపంచదేశాలకు ఇచ్చినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత.. జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కులు పూర్తిగా అణచివేతకు గురయ్యాయని, సామాన్య ప్రజలు గడప దాటి బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోనూ లేవనెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికీ తీసుకెళ్లారు. ఇలాంటి వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుని రావడానికే కేంద్రం యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందాన్ని ఆహ్వానించి ఉంటుందని చెబుతున్నారు.