అటల్ భోజన ప్రియుడే.: హైదరాబాద్ బిర్యానీ, ఎన్టీఆర్ ఇడ్లీ! మాధురీతో మాటల్లో పెట్టి గులాబ్జాం మాయం!
Recommended Video
న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజపేయి అత్యుత్తమ ప్రధాని, మంచి కవి అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆయన భోజన ప్రియుడు కూడా. అంతేగాక, పాకశాస్త్రంలోనూ మంచి ప్రవీణత గల వ్యక్తి.
వాజపేయి పలు సందర్భాల్లో పాత్రికేయుల కోసం వంట చేసి వంచేసి వారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. భోజన విషయానికి వస్తే శాకాహారం, మాంసాహారం అన్నింటినీ ఇష్టపడేవారు.
హైదరాబాద్ వస్తే బిర్యానీ
ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి ఆహారం తప్పకుండా రుచి చూసేవారు వాజపేయి. కోల్కతాలో పచ్కాలు, హైదరాబాద్ వస్తే బిర్యానీ, హలీం.. లక్నో వెళ్తే గలోటీ కబాబ్లు, కాన్పూర్ వెళితే అక్కడి స్వీట్స్ను తప్పకుండా తినేవారు.
మసాల టీ, పకోడీలు.. వెంకయ్య తీసుకొచ్చే రొయ్యలు..
చాట్ మసాలా చల్లిన వేడి పకోడీ తినడమన్నా ఇష్టమే. మసాలా టీ అంటే ఇష్టపడేవారు. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ఎదురుగా వేరుసెనగ పలుకులు ఉండాల్సిందే. పాత ఢిల్లీలో దొరికే బెండకాయలు-బంగాళదుంపల కూర, చాట్ తీసుకురావాలని కేంద్రమంత్రి విజయ్ గోయల్కు చెప్పేవారు. వెంకయ్య నాయుడైతే రొయ్యలు తీసుకెళ్లేవారు.
మాధురీ దీక్షిత్ తో మాటల్లో పెట్టి గులాబ్జాం మాయం చేశారు!
వాజపేయికి గులాబ్జాంలంటే చాలా ఇష్టం. ఒకసారి ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన అధికార విందులో గులాబ్జాంలను కూడా పెట్టారు. ఆరోగ్యం దృష్ట్యా ఆయన వాటిని తినకూడదు. దీంతో అక్కడి సహాయకులు ఓ ఉపాయం ఆలోచించారు. ఆ విందుకు వచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ను ఆయనకు పరిచయం చేశారు. ఇద్దరూ సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో గులాబ్జాంలను అక్కడి నుంచి తీసేసి, వాటిపై ఆయన దృష్టి పడకుండా చేశారు.
విజయవాడలో ఇడ్లీలు.. ఎన్టీఆర్ స్వయంగా..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఆయ్యాక విజయవాడలో మహానాడు జరిగింది. ఆ మహానాడుకు హాజరైన మాజీప్రధాని వాజపేయి, అద్వానీలకు స్థానిక బాబాయ్ హోటల్ నుంచి అల్పాహారం తెప్పించి మరీ ఎన్టీఆర్ స్వయంగా వడ్డించారట. భోజన ప్రియుడైన వాజపేయి వాటిని ఇష్టంగా తిన్నారట.