కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్
పేరుకు తగ్గట్లే కరనా పాండమిక్(మహమ్మారి) విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గ్లోబల్గా నిన్న ఒక్కరోజే కొత్తగా 4.94లక్షల మందికి సోకిన వైరస్.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 9,161మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8.2కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా చోటుచేసుకున్న మరణాలు, ఏ వయసు, వర్గం వారిపై మహమ్మారి ఏ విధమైన ప్రభావం చూపిందో కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది.
బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ
మృతుల్లో 70శాతం మగవాళ్లే
భారత్లో కరోనా వైరస్ మహిళల కన్నా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా బారిన పడి చనిపోయిన వారిలో 70శాతం మంది మగవాళ్లేనని వెల్లడించింది. కరోనా కాటుకు బలైన వారిలో 55శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విడుదల చేశారు.
ఆరు నెలల కనిష్టానికి కేసులు..
భారత్ లో ఈఏడాది జనవరిలో తొలి కరోనా కేసు నమోదైంది. మార్చిలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించేనాటికి కేసుల సంఖ్య ఐదు వేలలోపే ఉన్నా, ఏప్రిల్ నుంచి క్రమంగా పెరుగుతూ మే, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో ఆల్మోస్ట్ విలయ పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ నుంచి కొత్త కేసులు వేగంగా తగ్గుముఖంపట్టాయి. ఆరు నెలల తర్వాత దేశంలో తొలిసారి 17వేల కన్నా తక్కువ పాజిటివ్ కేసులు, 300 కన్నా తక్కువ మరణాలు సోమవారం నమోదైనట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.02శాతంగా ఉన్నట్టు తెలిపింది.
యువతపైనే వైరస్ అధిక ప్రభావం..
కొవిడ్ బారిన పడినవారిలో 63శాతం మంది పురుషులు కాగా.. 37శాతం మంది మహిళలు ఉన్నారు. వైరస్ సోకినవారిలో యువకులే అధికం. వైరస్ సోకినవారిలో 52శాతం మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సువారు ఉండగా.. 60 ఏళ్లు పైబడినవారు 14శాతం, 45 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు 26శాతం, 17 ఏళ్లకంటే తక్కువ వయస్సు గలవారు 8శాతంగా ఉన్నారు.
5రాష్ట్రాల్లోనే తీవ్ర ప్రభావం
భారత్లో మంగళవారం నాటి 16,423 కొత్తవాటిని మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303కి పెరిగింది. వీరిలో 98,07,569 మంది (95.92శాతం రికవరీ రేటుతో) కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,48,153 మంది (1.45శాతం) మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,68,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, యాక్టివ్ కేసుల్లో 60 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోనే యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయి.
భారత్ చాలా బెటర్..
కరోనా ఇన్ఫెక్షన్లు మరణాల విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. ప్రతి మిలియన్ జనాభాకు భారత్లో 7408 కేసులు నమోదు కాగా.. అమెరికాలో ఆ సంఖ్య 56,879గా ఉంది. అలాగే, ఫ్రాన్స్లో 38,550, బ్రెజిల్లో 35,123, ఇటలీలో 33,867, యూకే 33,708, రష్యాలో 21,091 చొప్పున కేసులు నమోదయ్యాయి. గ్లోబల్ గా కేసుల సంఖ్య 8.2కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరాయి.
నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదన