'మి టూ'కు కౌంటర్గా 'మెన్ టూ'ను ప్రారంభించిన బెంగళూరువాసులు, ఫ్రాన్స్ మాజీ రాయబారి కూడా
బెంగళూరు: గత కొద్ది రోజులుగా తమను లైంగికంగా వేధించిన పురుషులపై పలువురు మహిళలు 'మి టూ' అంటూ ఫిర్యాదులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పురుషులపై వేధింపులను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు 'మెన్ టూ' అంటూ బెంగళూరుకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
నా కన్నీళ్లు ఆగేదాకా గదిలోనే ఉండిపోయా, లాక్కొని ముద్దు పెట్టారు: ఎంజే అక్బర్పై 15వ మహిళ
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న క్రిస్ప్ అనే స్వచ్ఛంద సంస్థ దీనిని ప్రారంభించింది. ఈ సంస్థ నిర్వాహకుడు సామాజిక కార్యకర్త. అతని పేరు కుమార్ జాగిర్దార్. అతనితో పాటు మరో పదిహేను మంది కలిసి మెన్ టూను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన విషయాలను వారు ఆదివారం వెల్లడించారు.
తాము మీటూకు వ్యతిరేకం కాదని, కానీ తప్పుడు కేసులు, ఆరోపణల కారణంగా బాధపడుతున్న పురుషుల ఆవేదనను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు దీనిని ప్రారంభించామని చెప్పారు.
వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండటం గమనార్హం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడని ఆయనపై భార్య కేసు పెట్టింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని 2017లో కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.
క్రిస్ప్ నిర్వాహకుడైన జాగిర్దార్ వృత్తిరీత్యా అకౌంటెంట్, స్టాక్ మార్కెట్ నిపుణుడు. భార్యాబాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో ఆయనది కీలక పాత్ర. గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాల్లో సవరణలు చేయాలంటూ పదిహేనేళ్లుగా పోరాడుతున్నారు.
భార్య ఆయనను వదిలి వెళ్లిపోయింది. కూతురను కూడా తీసుకెళ్లింది. ఆమె ఓ క్రికెటర్ను వివాహం చేసుకుంది. తమ కూతురు సంరక్షణ భారం తనకు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అందులో విజయం సాధించారు. మహిళలకు, పురుషులకు ఎవరికి అన్యాయం జరిగినా పోరాటం చేస్తానని ఆయన అన్నారు.