రూ. 25 కోట్ల ‘మ్యావ్ మ్యావ్’ డ్రగ్స్ సీజ్
న్యూఢిల్లీ: రేవ్ పార్టీలలో విచ్చలవిడిగా ఉపయోగించే మ్యావ్ మ్యావ్ అనే డ్రగ్స్ ను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠా సభ్యులు (స్మగ్లర్స్) 8 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న 14 కిలోల డ్రగ్స్ విలువ మార్క్ ట్ లో రూ. 25 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటి సారి అని అధికారులు చెప్పారు.
అయితే స్మగ్లర్స్ చెప్పిన వివరాలు తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు. కస్టమ్స్ శాఖలో ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారి ఈ డ్రగ్స్ రవాణా చేయడంలో కీలకపాత్ర పోషించాడని వెలుగు చూసింది.
అతను గత రెండు రోజుల నుంచి కార్యాలయానికి రావడం లేదని, ఇల్లు తాళం వేసి ఉందని అధికారులు చెప్పారు. మెఫిడ్రోన్ అనే సాంకేతిక పేరున్న ఈ మ్యావ్ మ్యావ్ డ్రగ్ ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా విక్రయిస్తున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
యూఏఈలో ఉంటున్న కైలాష్ (మహారాష్ట్ర సొంత ప్రాంతం) అనే వ్యక్తి ఈ డ్రగ్స్ రాకెట్ ప్రధాన సూత్రధారి అని అధికారులు వివరాలు సేకరించారు. కైలాష్ కు అండర్ వరల్డ్ తో సంభందాలు ఉన్నాయని, అతని పేరు బయటపడగానే ముంబై నుంచి దుబాయ్ పారిపోయాడని అధికారులు అన్నారు.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో జరిగే రేవ్ పార్టీలలో ఈ డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారని వెలుగు చూసింది. రిషి, గుడ్డు అనే ఇద్దరు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, సంజయ్, దీపక్, మనోజ్ తదితరులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని విచారణలో వెలుగు చూసింది.
మహేందర్ అనే వ్యక్తి ఎక్కువగా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని, వీరందరిని అరెస్టు చేశామని అధికారులు చెప్పారు. కస్టమ్స్ ఇన్స్ పెక్టర్ తనకు 21 కిలోల డ్రగ్స్ ఇచ్చాడని, అందులో 12 కిలోలు ఇప్పటికే విక్రయించానని మహేందర్ విచారణలో అంగీకరించాడు.
మహేందర్ నుంచి 9 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రిటైల్ గా స్థానికులకు విక్రయించే సమయంలో ఎక్కువ బరువు ఉండటానికి డ్రగ్స్ లో అజినమాటో అనే పదార్థం కలిపి 10 గ్రాముల ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.