నమస్కార్ అంటూ ఒబామా, మోడీపై ప్రశంసలు... భారత్కు సహకారం
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. భారత్తో మైత్రి మరింతగా బలపడటం నా హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఒక పదవీ కాలంలో రెండు సార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా నేనే కావడం సంతోషం. భారత్ జరుపుకునే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రెండో సారి భారత్ రావడం సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడేందుకు తన తోడ్పాడు అందిస్తానని పేర్కొన్నారు.
భారత్తో అణు పౌర ఒప్పందం కీలక అడుగువేశామన్నారు. గత ఏడాది వాషింగ్టన్ వచ్చినప్పుడు, అక్కడ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో మీ ప్రసంగానికి బాలీవుడ్ స్టార్కు వచ్చినట్లుగా జనం రావడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రధాని మోడీతో 'చాయ్ పే చర్చా' బాగా జరిగిందన్నారు. ఇలాంటివి వైట్ హౌస్ లో కూడా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది మరింతగా పెరగాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ - అమెరికాల మధ్య పరస్పర సహాకారం ఉంటుందని అన్నారు. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉండటంతో పాటు రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైడ్రో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాం. భారత్లో మోడీ ప్రవేశపెట్టిన సంస్కరణలు హర్షణీయమన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి తమ మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు.
ప్రధాని మోడీతో కలసి రేడియో ప్రసంగం కోసం ఆసక్తితో ఉన్నానని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భారతీయులకు మరోసారి చెబుతున్నాననని తన ప్రసంగాన్ని ముగించారు.
ఉక్రెయిన్లో సైనిక జోక్యం ఉండదు: ఒబామా
ఉక్రెయిన్లో సైనికజోక్యం ఉండదని అమెరికా అధ్యక్షుడు మీడియా సమావేశంలో అన్నారు. రష్యా బలహీనపడటం లేక ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ గాడితప్పడం వంటి అంశాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. యెమెన్లో రాజకీయ తిరుగుబాట్లు జరుగుతున్నాయని, శాంతికి సహకరిస్తామని ఆయన సూచించారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అమెరికా పోరాటం సాగిస్తుందని, దేశాల రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోమని ఆయన చెప్పారు.