షాకింగ్ రిపోర్ట్: ఐటీ కట్టింది 1.7 శాతమే!: రూ. 100కోట్ల పన్ను కట్టింది ఒక్కరే!
న్యూఢిల్లీ: ఆదాయ గణాంకాల నివేదిక వెల్లడించిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దేశ జనాభాలో 1.7 శాతం మందే 2015-16 మదింపు సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించారని ఐటీ విభాగం వెల్లడించింది. ఆ ఏడాది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 4.07 కోట్లు కాగా, ఇందులో పన్ను చెల్లించింది 2.06 కోట్ల మందే కావడం గమనార్హం.
మిగిలినవారి వార్షికాదాయం పన్ను పరిధి కంటే తక్కువ ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2014-15 మదింపు సంవత్సరంలో పన్ను రిటర్నులను 3.65 కోట్లు మంది దాఖలు చేసినా, పన్ను చెల్లించిన వారు 1.91 కోట్ల మందేనని వెల్లడించింది. కాగా, పన్ను కింద జమయిన మొత్తం రూ.1.91 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు తగ్గిపోయింది.
2015-16 నివేదిక ఇలా..
ఐటీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని 120 కోట్ల మంది ప్రజల్లో 3 శాతం మందే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. వీరిలో 2.01 కోట్ల మంది పన్ను చెల్లించలేదు. 9,690 మంది రూ.కోటికి పైగా చెల్లించారు.
రూ.వందకోట్లకు పైగా చెల్లించింది ఒక్కరే..
కాగా, ఒక్కరు మాత్రమే రూ.100 కోట్ల కంటే అధికంగా పన్ను చెల్లించగా, ఈ మొత్తం రూ.238 కోట్లుగా నమోదైంది. 1.33 కోట్ల మంది వార్షికాదాయం రూ.2.5-3.5 లక్షల మధ్య ఉంది. 2.80 కోట్ల మంది నుంచి రూ.19,931 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో రూ.5.5-9.5 లక్షలను వార్షిక ఆదాయపు పన్నుగా చెల్లించినవారు ఎక్కువ. రూ.1.5 లక్షల కంటే తక్కువగా, సగటున రూ.24,000 పన్ను చెల్లించిన వారి సంఖ్య 1.84 కోట్లు.
ఆదాయం పెరిగింది..
రిటర్నులు దాఖలు చేసిన వారిలో 82 లక్షల మంది, తమ వార్షికాదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువే చూపడం గమనార్హం. ఫలితంగా వారు పన్ను చెల్లించలేదు. 2014-15 మదింపు సంవత్సరంలో ఇలాంటివారు 1.37 కోట్ల మంది ఉన్నారు. 2014-15 మదింపు ఏడాది పన్ను చెల్లింపుదార్ల ఆదాయం మొత్తం కలిపి రూ.18.41 లక్షల కోట్లు కాగా, 2015-16లో ఇది రూ.21.27 కోట్లకు పెరిగింది.
రిటర్నులు పెరిగాయి..
వ్యక్తులతో సహా మొత్తం 4.35 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు కాగా, వీరి మొత్తం ఆదాయం రూ.33.62 లక్షల కోట్లుగా నమోదైంది. 2014-15 మదింపు ఏడాది 3.91 కోట్ల రిటర్నుల మొత్తం ఆదాయం రూ.26.93 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీలు 7.19 లక్షల రిటర్నులు వేయగా, వీటి స్థూల ఆదాయం రూ.10.71 లక్షల కోట్లుగా ఉంది.