లోక్సభ, రాజ్యసభ టీవీల విలీనం- కొత్తగా సన్సద్ టీవీ ఆవిర్భావం
భారత్లో పార్లమెంటు ఉభయసభల ప్రసారాలతో పాటు ఇతర కార్యక్రమాల ప్రసారాలు చేస్తున్న లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని సంసద్ టీవీ పేరుతో ఏర్పాటు చేసే కొత్త ఛానల్లో విలీనం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం తాజాగా నిర్ణయం ప్రకటించింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రవి కపూర్ను సీఈవోగా నియమించారు.
2019 నవంబర్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంయుక్తంగా లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీల విలీనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రసార భారతి మాజీ ఛైర్మన్ సూర్యప్రకాష్ దీనికి నేతృత్వం వహించారు. గత నెలలో ఈ కమిటీ తన నివేదికను కేంద్రానికి అందజేసింది. దీని ఆధారంగా రెండు టీవీల విలీనం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఈ ప్రక్రియను సాఫీగా ముగించడం కోసం మరో మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది.
లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీలు విలీనమైనా సంసద్ టీవీ పేరుతో ఉభయసభల ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతాయనికేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూర్యప్రకాష్ కమిటీ అధ్యయనంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కొనసాగాల్సిందేనని అభిప్రాయపడినట్లు నివేదికలో తెలిపారు. సమావేశాలు ముగిశాక లేదా సమావేశాలు లేనప్పుడు ఇతర అంశాలు ప్రసారం చేయాలని నిర్ణయించారు. అయితే లోక్సభకు సంబంధించిన అంశాలను హిందీలోనూ, రాజ్యసభకు సంబధించిన విషయాలను ఇంగ్లీష్లోనూ ప్రసారం చేయనున్నారు. తద్వారా సన్సద్ టీవీకి మంచి బ్రాండింగ్తో పాటు ప్రేక్షకాదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.