కర్ణాటకలో మరో చిచ్చు పెట్టడానికి మరాఠీలు ప్లాన్, అదే రోజు మహా మేళకు ఏర్పాట్లు, పోలీసులు !
కర్ణాటక శాసన సభా శీతాకాల సమావేశాలు బెళగావిలో 10 రోజుల పాటు జరుగుతున్న సందర్బంగా నిరసన వ్యక్తం చెయ్యాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) నాయకులు నిర్ణయించారు.
బెంగళూరు: కర్ణాటక శాసన సభా శీతాకాల సమావేశాలు బెళగావిలో 10 రోజుల పాటు జరుగుతున్న సందర్బంగా నిరసన వ్యక్తం చెయ్యాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) నాయకులు నిర్ణయించారు. బెళగావిలో 'మహా మేళవ'(మహా మేళ) కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
నవంబర్ 13వ తేదీ నుంచి బెళగావిలో శాసన సభా శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 13వ తేదీన బెళగావిలో మహా మేళవ కార్యక్రమం నిర్వహించాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి నిర్ణయించింది. మహా మేళవ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని బెళగావి నగర పోలీసు కమిషనర్ కు ఆ పార్టీ నాయకులు మనవి చేశారు.
నవంబర్ 1వ తేదీ కర్ణాటక రాజ్యోత్సవం (కర్ణాటక ఆవిర్బావధినోత్సవం) రోజూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి నాయకులు బ్లాక్ డే అంటూ నిరసన వ్యక్తం చేశారు. బెళగావిలో నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇప్పుడు బెళగావిలో శాసన సభా శీతాకాల సమావేశాలు మొదలైయ్యే రోజు మరో కార్యక్రమం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యారు.
నవంబర్ 13వ తేదీ బెళగావిలో నిర్వహించనున్న మహా మేళవ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ధనంజయ ముండే తదితరులను ఆహ్వానించాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి నాయకులు సిద్దం అయ్యారు. పోలీసులు అనుమతి ఇస్తారా, లేదా అంటూ ఎంఇఎస్ నాయకులు ఎదురు చూస్తున్నారు.