మోడీ రియల్ హీరో, నేను జీరో!: బీజేపీ గెలుపుతో మాటమార్చిన ఎంపీ
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు వరకు సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సంజయ్ కకడే మాట మార్చేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంతటి మెజార్టీని బీజేపీ సాధించలేదని ఇటీవల సంజయ్ కకడే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో.. మోడీ సత్తా గురించి ఆలోచించకుడా తాను వ్యాఖ్యలు చేశానంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీనే అసలైన హీరోనని, తాను జీరో అయిపోయానని బీజేపీ ఎంపీ సంజయ్ కకడే అన్నారు. 'మోడీకి ఉన్న బలం, సత్తా గురించి నేను కానీ, నా టీం కానీ ఆలోచించలేదు. మోడీకి ఉన్న జనాకర్షణే ఎన్నికల్లో గెలిచేలా చేసింది. మోడీ రియల్ హీరో, నేను జీరో' అని సంజయ్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల కౌంటింగ్కు ఒక్కరోజు ముందు సంజయ్.. ఆరుగురు వ్యక్తులున్న ఓ బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్లో సర్వే చేయమని పంపించారు. వాళ్లంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా సర్వే చేశారు.
ఈ సర్వే నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. గుజరాత్లో బీజేపీ విజయం సాధించలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి మెజార్టీ కూడా రాదని తెలిపారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించడంతో తాను తప్పులో కాలేసినట్లు సంజయ్ కకడే చెప్పుకుంటున్నారు.