కర్ణాటక మంత్రి రాసలీలు: సీడీని బయటపెట్టినవారిని విచారించిన సీఐడీ
కేసులో పాత్రికేయులను విచారించాల్సిన అవసరమేమి లేదని రాజశేఖర్ ములాలిని వ్యాఖ్యానించడం గమనార్హం.
బెంగుళూరు: సీఐడీ డీఎస్పీ సిఆర్.రవిశంకర్ నేతృత్వంలో బుధవారం నాడు బళ్లారిలోకాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రి హెచ్వై మేటి రాసలీల వ్యవహారంపై విచారణ జరిగింది. మేటీ రాసలీలకు సంబంధించిన సీడీలను సామాజిక కార్యకర్త రాజశేఖర్ ములాలి, మాజీ డీఎస్పీ అనుపమాశెణైలు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో విడుదల చేయడంతో దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ పరిణామాలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య క్యాబినెట్ నుంచి మేటిని తొలగించారు. అనంతరం కేసును సీఐడీకి బదిలీ చేయడంతో.. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు బళ్లారిలో మేటి రాసలీలలపై సీడీని విడుదల చేసిన ప్రధాన కారకులను విచారించారు.
బుధవారం నాడు ప్రభుత్వ అతిథిగృహంలో కొనసాగిన ఈ విచారణలో సామాజిక కార్యకర్త రాజశేఖర్ ములాలితో పాటు మాజీ డీఎస్పీ అనుపమా శెణైను విచారించారు. తొలుత రాజశేఖర్ ములాలిని రెండు గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు.. అనంతరం మాజీ డీఎస్పీ అనుపమా శెణైను కూడా రెండు గంటల పాటు విచారించారు.
కేసులో విచారణ నిమిత్తం జనవరి 28వ తేదీన హాజరు కావాల్సిందిగా సీఐడీ అధికారులు అంతకుముందు రాజశేఖర్ ములాలికి నోటీసులు జారీ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని, మరో తేదీలో విచారణకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలంటూ ములాలిని కోరారు.
ములాలి అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీ బళ్లారిలోనేవిచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రభుత్వ అతిథిగృహంలో సీఐడి డీఎస్పీ రవిశంకర్ నేతృత్వంలో అధికారుల బృందం వీరిద్దరిని విచారణ చేపట్టి పూర్తి వివరాలను సేకరించారు.
విచార సందర్బంగా.. నలుగురు పాత్రికేయులకు సైతం సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. కాగా, విచారణ అనంతరం సామాజిక కార్యకర్త రాజశేఖర్ ములాలి మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి తమకు తెలిసిన సమాచారాన్ని, నిజాలను అధికారులకు తెలియచేశామన్నారు.
కేసును విచారిస్తున్న సీఐడీ అధికారి రవిశంకర్ ప్రామాణిక తీరు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అవార్డు పొందిన ఉత్తమ అధికారిగా రవిశంకర్ గుర్తింపు పొందారని అన్నారు. కేసులో పాత్రికేయులను విచారించాల్సిన అవసరమేమి లేదని రాజశేఖర్ ములాలిని వ్యాఖ్యానించడం గమనార్హం.