#MeToo: కొత్త ముఖ్యమంత్రిపై పాత ఆరోపణలు: ఐఎఎస్ అధికారిణికి అభ్యంతకర మెసేజ్
చండీగఢ్: పంజాబ్లో ఎట్టకేలకు రాజకీయ హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ఆదివారం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ వారసుడిగా చరణ్జిత్ సింగ్ ఛన్నీని ఎంపిక చేసింది. చరణ్జిత్ సింగ్ను ఎంపిక చేయడానికి- ఢిల్లీలో కొన్ని అనూహ్యమైన పేర్లు చక్కర్లు కొట్టాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికాసోనీని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే వార్తలొచ్చాయి.
Virat Kohli: మరో బాంబు పేల్చిన రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్: ఆయన చివరి కోరిక అదే
కాస్సేపట్లో ప్రమాణం..
ఆ ఆఫర్ను ఆమె తిరస్కరించడం, కొద్దిసేపటికే పంజాబ్ మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధవా పేరు తెరమీదికి రావడం చకచకా సాగిపోయాయి. ఆ తరువాత సాయంత్రానికి చరణ్జిత్ సింగ్ ఛన్నీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వెంటనే ఆయన గవర్నర్ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం 11 గంటలకు ఛన్నీ- పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దళిత నేతకు ముఖ్యమంత్రి పదవి..
చరణ్జిత్ ఛన్నీ కూడా ప్రస్తుతం పంజాబ్ మంత్రిగా ఉన్నారు. సాంకేతిక విద్య, పర్యాటకం, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్నారు. దళిత సిక్ సామాజిక వర్గం రామ్ దాసియా కమ్యూనిటీకి చెందిన నాయకుడాయన. చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఫైర్బ్రాండ్ ఇమేజ్ ఉంది. దూకుడుగా ఉంటారనే గుర్తింపు ఉంది. అదే ఆయనను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఐఎఎస్ అధికారిణికి..
కాగా- చరణ్జిత్ సింగ్ ఛన్నీపై ఉన్న ఓ పాత ఆరోపణలు ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. మీటూకు సంబంధించిన ఆరోపణ అది. రాజకీయ ప్రత్యర్థులు దాన్ని తవ్వి తీశారు. మూడేళ్ల కిందటి ఆరోపణలను తెర మీదికి తీసుకొచ్చారు. ట్రెండింగ్ చేస్తోన్నారు. 2018లో ఓ ఐఎఎస్ అధికారిణికి అభ్యంతకరమైన టెక్స్ట్ మెసేజ్ను పంపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఆ కేసు పరిష్కారమైనట్లు అప్పటి ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ నుంచి నోటీసులు కూడా..
చరణ్జిత్ సింగ్ ఛన్నీ నుంచి అభ్యంతరకరమైన టెక్స్ట్ మెసేజ్పై ఆ ఐఎఎస్ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. దీనితో ఆయన దీన్ని పరిష్కరించినట్లు వార్తలు వచ్చాయి అప్పట్లో. దీనిపై అప్పట్లో మహిళా కమిషన్ ఛన్నీకి నోటీసులను సైతం జారీ చేసింది. ప్రస్తుతం ఆ ఐఎఎస్ అధికారిణి పంజాబ్ సర్వీస్లో లేరు. కేంద్ర సర్వీసులకు వెళ్లినట్లు సమాచారం. దీనితో ఆ వ్యవహారం సద్దుమణిగినట్లు చెబుతున్నారు.
తవ్వి తీస్తోన్న ప్రత్యర్థులు..
కాగా- ఛన్నీ ముఖ్యమంత్రిగా నియమితులు కావడం వల్ల రాజకీయ ప్రత్యర్థులు దీన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చారు. మీటూ హ్యాష్ ట్యాగ్ను ట్రెండింగ్ చేస్తోన్నారు. భారతీయ జనతా పార్టీ ఇదివరకు మీటూ ఆరోపణలను ఎదుర్కొన్న కేంద్రమంత్రిని పదవి నుంచి ఉద్వాసన పలకగా.. అవే తరహా విమర్శలు ఉన్న ఓ నాయకుడిని ఏకంగా ముఖ్యమంత్రిని చేసిందంటూ దాడి చేస్తోన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే- ఈ పాత ఆరోపణలు తెరమీదికి రావడంతో పంజాబ్ రాజకీయాల్లో కలకలం చెలరేగుతోంది.
Recommended Video
కాంగ్రెస్ రెబెల్స్ కూడా..
అటు కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మీటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఓ నాయకుడిని ఏకంగా ముఖ్యమంత్రిని చేశారంటూ వస్తోన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పి కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు, ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.