కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్: 88 ఏళ్ల వయస్సులో: ఎంట్రీ కోసం కమలం స్కెచ్
తిరువనంతపురం: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఏ మాత్రం కొరుకుడు పడని రాష్ట్రాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈశాన్యంలో ఉన్న అస్సాంను వదిలేస్తే.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తప్ప మరో పార్టీ ఉనికి పెద్దగా లేకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ కాషాయ జెండాను ఎగురవేయడానికి విశ్వ ప్రయత్నాలను చే్స్తోన్నారు కమలనాథులు. లోక్సభ ఎన్నికల్లో కనపరిచిన దూకుడును అసెంబ్లీ బరిలోనూ కొనసాగించడానికి శ్రమిస్తోన్నారు.
దక్షిణాదిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఈ సారి బోణీ కొట్టాలనే పట్టుదలను బీజేపీ నేతలు కనపరుస్తున్నారు. అధికార అన్నా డీఎంకేతో పొత్తును పెట్టుకున్నారు. భావసారూప్యం గల పార్టీల మద్దతు కోసం పావులు కదుపుతోన్నారు. కేరళలో ఎంట్రీ లభించని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మినహా మరో కూటమి లేదు. ఫలితంగా సొంతంగా పోటీ చేయడం మినహా మరో దారి లేదా పార్టీకి. అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకంగా ఓటుబ్యాంకును సృష్టించుకోవడానికి మల్లగుల్లాలు పడుతోంది.
ఈ పరిణామాల మధ్య ఓ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రో మ్యాన్ ఈ శ్రీధరన్ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కేరళలో తాము అధికారంలోకి వస్తే.. శ్రీధరన్ను ముఖ్యమంత్రిని చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ర్యాలీని నిర్వహిస్తోన్నారు. ఇందులో భాగంగా తిరువళ్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఈ ప్రకటన చేశారు. మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని అన్నారు.