బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్: లవ్ జిహాద్, బీఫ్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు
తిరువనంతపురం: ఇటీవల ప్రకటించినట్లుగానే మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ గురువారం అధికారికగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 88 ఏళ్ల మెట్రోమ్యాన్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశమనే చెప్పవచ్చు.
సీఎం పదవి చేపట్టేందుకు నేను రెడీ, మోడీపై విమర్శలు ఫ్యాషనే: 'మెట్రో మ్యాన్' శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు
అదే నా టార్గెట్: సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమన్న శ్రీధరన్
కాగా, బీజేపీలో చేరిన సందర్భంగా శ్రీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధమేనని అన్నారు. బీజేపీ కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. తన ప్రధాన లక్ష్యం మాత్రం కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు.
దేశంలో అనేక మెట్రో రైలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీధరన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అసాధ్యమనుకున్న కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఆయన విజయవంతంగా పూర్తి చేశారు.
కేరళకు అప్పుల్లేకుండా చేస్తా..
'ఒకవేళ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. రాష్ట్రానికి అప్పులు లేకుండా చేస్తా. ఆ తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగిస్తా' అని శ్రీధరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సీపీఐ-ఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటములు శ్రీధరన్ బీజేపీలో చేరడంతో షాకయ్యాయి.
అందుకే బీజేపీలో చేరా
'ఎల్డీఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు రాష్ట్రానికి ఎంతో చేయాల్సి ఉన్నా ఏమీ చేయలేదు. కేరళ రాష్ట్రానికి తనవంతుగా ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాయి. అందుకే నేను బీజేపీలో చేరాను. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని శ్రీధరన్ వ్యాఖ్యానించారు.
శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు: ఆయనపై ఫిర్యాదులు
కాగా, శ్రీధరన్ సొంత పట్టణమైన పొన్నాని పోలీస్ స్టేషన్లో ఆయన పలు ఫిర్యాదులు కూడా అందాయి. రాష్ట్రంలో లవ్ జిహాద్ ఘటనలు బాగా పెరిగిపోయాయని, హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను మోసం చేసి మతం మారుస్తున్నారని శ్రీధరన్ ఆరోపించారు. అంతేగాక, ఆవు మాంసం తినేవారంటే తనకు ఇష్టం లేదని శ్రీధరన్ వ్యాఖ్యానించడంపై పలువురు ఫిర్యాదులు చేశారు. అయితే, ఈ ఫిర్యాదులు రాతపూర్వకంగా కాకుండా మౌఖికంగా చేయడం గమనార్హం. పోలీసులు దీనిపై నిబంధనల ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు.