సీఎం పదవి చేపట్టేందుకు నేను రెడీ, మోడీపై విమర్శలు ఫ్యాషనే: ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన భారత మెట్రో మ్యాన్ శ్రీధరన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కేరళ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలోకి మెట్రోమ్యాన్!: కేరళ కాషాయ పార్టీకి బూస్ట్, శ్రీధరన్ ఏమన్నారంటే..?
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నేను రెడీ: శ్రీధరన్
బీజేపీ నిర్ణయం మేరకు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపిన శ్రీధరన్.. ఒకవేళ పార్టీ కోరితే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. బీజేపీని కేరళలో అధికారంలోకి తీసుకురావడమే తన మొదటి లక్ష్యమని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మూడు, నాలుగు ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాష్ట్రంలోకి పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. గవర్నర్ పదవిపై తనకు పెద్దగా ఆశలేదని, ఒకవేళ ఆ పదవి కేటాయించినా రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండదని తెలిపారు.
అందుకే బీజేపీలో చేరుతున్నా: శ్రీధరన్
ప్రస్తుం కేరళ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఒక్కో వ్యక్తిపై రూ. 1.2 లక్షల అప్పు ఉందని శ్రీధర్ వెల్లడించారు. కాగా, కేరళ రాష్ట్రాన్ని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కొన్ని ఏళ్లుగా పాలిస్తున్నాయని శ్రీధరన్ చెప్పారు. ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు శ్రీధరన్.
స్వరాష్ట్రం కేరళకు ఏదైనా చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి..
ఎప్పుడూ కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తూ ఈ రెండు ప్రభుత్వాలు కొన్ని ముఖ్యమైన అంశాలను పట్టించుకోకుండా వదిలేశాయన్నారు. అదే బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని శ్రీధరన్ వివరించారు. వృత్తిపరంగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించానని, సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలన్న తపనతోనే తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు శ్రీధరన్ వెల్లడించారు.
మోడీ సర్కారు ఏం చేసినా వ్యతిరేకించడం ఫ్యాషనైపోయింది..
ఇక కేంద్రంలోని నరేంద్ర మోడీపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా శ్రీధరన్ స్పందించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడం ఫ్యాషనైపోయిందని ఆయన మండిపడ్డారు. దేశంలో అసహనం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేసేవన్నారు. రైతు చట్టాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు. విదేశీ వ్యవస్థలు, సామాజిక మాధ్యమాల ముందు భారత ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయడాన్ని వాక్ స్వాతంత్ర్యంగా పిలవకూడదన్నారు. ఇది వ్యవస్థపై యుద్ధంతో సామానమని వ్యాఖ్యానించారు. ఈ రాజ్యాంగబద్ధ హక్కును మనదేశానికి వ్యతిరేకంగా దుర్వినియోగపర్చడాన్ని నియంత్రించాలన్నారు.
మోడీ నిజాయితీపరుడు, శ్రమజీవి
ఈ సందర్భంగా ప్రధాని మోడీపై శ్రీధరన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీని అనేక సంవత్సరాలుగా తనకు తెలుసన్నారు. గుజరాత్ సీఎంగా మోడీ పనిచేసిన కాలంలో తాను అనేక ప్రాజెక్టుల కోసం గుజరాత్లో పనిచేశానని చెప్పారు. మోడీ చాలా నిజాయితీపరుడని, శ్రమజీవి అని అన్నారు. అవినీతికి పాల్పడబోరని, దూరదృష్టిగలవారని శ్రీధరన్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా చాలా చిన్నా చితక పార్టీలున్నాయని, ఇవన్నీ కలిసి బీజేపీపైన దాడి చేస్తున్నాయన్నారు. ఇది సరికాదని హితవు పలికారు. కాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శ్రీధరన్ చేరిక బీజేపీలో కొత్త ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా త్వరలోనే కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.